సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని విభాగాలకు, అన్ని స్థాయిల్లో విస్తరింపజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోనూ అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణను పక్కాగా చేపట్టడంతోపాటు.. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎస్హెచ్జీ అకౌంటింగ్ యాప్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. మొత్తం మూడు జిల్లాల్లో 61,088 సంఘాలు ఉండగా, 6,47,225 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా సంఘం పద్దుల వివరాలను
ఎక్కడి నుంచి అయినా ఈజీగా తెలుసుకునే అవకాశం కలుగనున్నది.
పద్దుల లెక్క పక్కా
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సభ్యురాలికీ స్త్రీనిధితోపాటు బ్యాంకు లింకేజి వంటి ఏడు రకాల స్కీంల కింద చేయూత నందిస్తున్నది. విరివిగా రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందింప జేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. నల్లగొండ జిల్లాలో 28,192 సంఘాలు ఉండగా.. వీటిలో 2,99,587 మంది సభ్యులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 14,913 సంఘాల పరిధిలో 1,57,493 మంది, సూర్యాపేట జిల్లాలో 17,983 సంఘాల పరిధిలో 1,90,145 మంది సభ్యులు ఉన్నారు. 20-30 స్వయం సహాయక సంఘాలకు ఒకటి చొప్పున గ్రామైక్య సంఘాలు(వీఓ)లను ఏర్పాటు చేసి ప్రతి ఏటా కోట్ల రూపాయలను రుణాల రూపేణా అందిస్తుండడంతో పేద మహిళలకు ప్రయోజనం కలుగుతున్నది.
పారదర్శకత కోసం యాప్
ఎస్హెచ్జీలకు అందజేసే రుణాల్లో జీవనోపాధుల పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలకు ఆదాయాన్ని సమకూర్చే కిరాణ దుకాణాల ఏర్పాటు, పచ్చళ్లు, టైలరింగ్ వంటి వాటికి రుణాలను విరివిగా మంజూరు చేస్తున్నారు. ప్రతి నెలా సమావేశాలను నిర్వహించి గ్రామైక్య సంఘాల తీర్మానం మేరకు ఎస్హెచ్జీలో సభ్యులైన మహిళలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే చాలాచోట్ల సమావేశాలకు సభ్యులు పూర్తిస్థాయిలో హాజరవ్వడం లేదు. రుణాల మంజూరులోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. లెక్కల పద్దులను రిజిస్టర్లలో రాస్తుండడంతో సంఘం లీడర్లకు తప్పితే సభ్యులకు సంఘం నిధి, అప్పుల వివరాలు తెలియడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్నది. రుణాల పంపిణీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అందించడంతోపాటు..లెక్కల పద్దులను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ‘ఎస్హెచ్జీ అకౌంటింగ్ యాప్’ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి సంఘానికి ఐడీతోపాటు యూజర్ పాస్వర్డ్ను ఇవ్వనున్నారు. త్వరలోనే ప్రతి సభ్యురాలికి సైతం ఇదే తరహాలో ఐడీ, యూజర్ పాస్వర్డ్ ఇవ్వనున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నది. ఇకపై సమావేశానికి సంబంధించిన ఫోటోతో పాటు, తీర్మానాలు, రుణాల మంజూరు వంటి అన్ని వివరాలను యాప్లో వెంటనే అప్లోడ్ చేయనున్నారు. దీనివల్ల ప్రతి సభ్యురాలు తమ సంఘంలో ఉన్న నిధి ఎంత? అప్పు ఎంత ఉంది? ఎప్పటి లోపుగా చెల్లించాలి! తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్ లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన ఐడీతో సమగ్ర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమావేశానికి సభ్యుల హాజరు మొదలు..యాప్లో కార్యక్రమాల నిర్వహణ వరకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. తదనుగుణంగానే రానున్నరోజుల్లో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు.
యాప్ అమలుతీరుపై శిక్షణ
స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తెస్తున్నది. యాప్ అమలుతీరుపై ఇప్పటికే జిల్లా స్థాయిలో వీసీ, ఏపీఎంలకు శిక్షణ ఇచ్చాము. త్వరలోనే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు(వీఓఏ) శిక్షణ ఉంటుంది. అక్టోబర్ ఒకటి నుంచి యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా