సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హమీని అమలు చేశారు. ఇందులో భాగంగా గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 1,760 మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్మాహకులకు ప్రయోజనం చేకూరనున్నది. జిల్లాలో ప్రతి ఏజెన్సీలో ఇద్దరు లేదా ముగ్గులు కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను నియమించింది. మన ఊరు-మన బడిలో భాగంగా ప్రత్యేక వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల చెల్లింపు, జీతాల పెంపుతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బొడ్రాయిబజార్ : మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కనుకుంట్ల ఉప్పమ్మ మాట్లాడారు. పదేండ్లుగా వెయ్యి రూపాయల వేతనంతో పని చేస్తున్న కార్మికులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3వేలకు పెంచడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు పెంచమంటే లాఠీచార్జి చేశారని, నేడు అడుగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని, సూర్యాపేటలో మరోసారి మంత్రి జగదీశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ నెల 12న తెలంగాణ భవన్లో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్మికుల విజయోత్సవ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారని తెలిపారు. సభకు మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కోశాధికారి సైదమ్మ, నాయకులు మాచర్ల రామలక్ష్మి, రమాదేవి, వి.నాగమణి, మండలి దుర్గ, మంగ, పి.లక్ష్మి, ఎం.యశోద, రాణి, మంగమ్మ, యశోద, పర్వీన్, యల్లమ్మ, అంజమ్మ పాల్గొన్నారు.
పేదల మనసు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల మనసు తెలిసిన నాయకుడు. ఇచ్చిన మాట ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచారు. పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించారు. సమస్యలు పరిష్కరించే నాయకులకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
– వెంపటి గూరూజీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు
ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే అమలు చేస్తాం
మధ్యాహ్న కార్మికులకు పెంచిన వేతనాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే అమలు చేస్తాం. కార్మికులు విధిగా పని చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. లేకుంటే చర్యలు తీసుకుటాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
కేసీఆర్ సారుకు ధన్యవాదాలు
మా కష్టాలను తెలుసుకుని జీతాలు పెంచిన సీఎం సార్కు ధన్యవాదాలు. మా వంటోళ్లందరం రుణపడి ఉంటాం. మా జీతాలు రూ.3 వేలు చేసి కేసీఆర్ సార్ ప్రజల మనిషి అని నిరూపించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కష్టాలను తెలుసుకుంటున్న గొప్ప నాయకుడు.
– కె.నాగలక్ష్మి, కోదాడ
మా కష్టం గుర్తించింది సీఎం సారే
సీఎం సార్ మా కష్టం గుర్తించి జీతం పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు చాలీచాలని జీతం తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నాం. జీతం పెంపుతో మీమందరం కేసీఆర్కు రుణపడి ఉంటాం. గతంలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశ వర్కర్లకు కూడా జీతాలు పెంచిండు.
– ఎస్కే సైదాబీ, లింగగిరి, హుజూర్నగర్ మండలం
చాలా సంతోషంగా ఉంది
దిర్శించర్ల జడ్పీహెచ్ఎస్లో 15 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పని చేస్తున్న. ప్రతి నెలా వెయ్యి జీతం ఇచ్చారు. అదికూడా సక్రమంగా రాకపోయ్యేది. సీఎం కేసీఆర్ ఇప్పుడు మా జీతం రూ.3వేలకు పెంచడం చాలా సంతోషంగా ఉంది.
– వాసికర్ల జయమ్మ, దిర్శించర్ల, నేరేడుచర్ల మండలం