హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అత్యాచారం ఘటనలో బాధిత మహిళలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అత్యాచార ఘటనపై సూపరింటెండెంట్తో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. బాధితురాలితో మాట్లాడితేనే ఏం జరిగిందో చెప్పగలమన్నారు. బాధితురాలితో ఇవాళే మాట్లాడనున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు.
మరో బాధితురాలు ఎక్కడ ఉందో ఇంకా గుర్తించలేదన్నారు. ఆస్పత్రి నుంచి రోగి సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు తెలిపారు. అత్యాచార ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని మరోవైపు ఆస్పత్రి కూడా విచారణ జరుపుతోందన్నారు. ఆస్పత్రుల్లో మహిళా రోగుల భద్రతపైనా చర్చించనున్నట్లు సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
గాంధీ దవాఖానలో పేషేంటుకు సహకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్నగర్కు చెందిన ఒక వ్యక్తి (45) కిడ్ని పేషెంట్. అదే గ్రామానికి చెందిన గాంధీ దవాఖాన ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్రావు సహకారంతో ఈ నెల 4న గాంధీ దవాఖానలో చేరాడు.
పేషేంట్తో పాటు అతని భార్య (40) మరదలు (38), వారి అక్కకుమారుడు తోడుగా వచ్చారు. పేషేంట్ను ఈనెల 5న మరో వార్డుకు తరలించడంతో మహిళలు ఇద్దరు అడ్రస్ దొరకకపోవడంతో తికమక పడ్డారు. పెషెంట్ను చూపిస్తానని చెప్పిన ఉమమహేశ్వర్రావు తమను ఓ గదికి తీసుకువెళ్లి బందించి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.