గరిడేపల్లి, ఆగస్టు 3 : చేపల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి అవకాశాలున్నాయి. విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు, నాణ్యత లేని ఫీడ్, చికెన్ సెంటర్లలో దొరికే వ్యర్థాలు వాడడం వల్ల చేపలకు వ్యాధులు సంక్రమించడం, చనిపోవడం, తక్కువ దిగుబడి వచ్చి రైతులు నష్టాల పాలవుతున్నారు. నిపుణుల సూచనలు పాటించడం వల్ల ఆశాజనకమైన ఫలితాలు సాధ్యమని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బూర్గు లవకుమార్ తెలిపారు. అదనపు సమాచారం కోసం 9849063796నంబర్ను సంప్రదించవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించాలి…
వరి, ఇతర పంటలకు అనుకూలంగా లేని లోతట్టు భూములలో చేపల చెరువులను నిర్మించుకోవాలి.
చెరువు చుట్టూ ఊట బోది ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే చుట్టు పక్కల పంట భూముల్లో ఊట చేరి దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
చెరువుల విస్తీర్ణం లోతును బట్టి తూములు నిర్మించాలి. మురుగు నీటి పారుదల సక్రమంగా లేక చెరువు అడుగు భాగంలో వ్యర్థాలు, విషవాయువులు పేరుకుని చేపలపై ఒత్తిడి పెరుగుతుంది.
చెరువులోకి నీటిని పంపే ముందు తప్పక 60-80 సైజు వస్త్రంతో వడగట్టి వదలాలి. లేదంటే ఇతర రకాల చేపలు, మాంస భక్షక చేపలు ప్రవేశించి నష్టాన్ని కలిగిస్తాయి.
ముందుగా ఒక మీటర్ లోతు మాత్రమే నీరుపెట్టి సరిపడా మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడి ప్లవకాలు (ఫ్లాంక్టాన్) అభివృద్ధి చేసుకోవాలి.
మాగపెట్టకుండా సేంద్రియ ఎరువులు, పేడ, కోళ్ల పెంట చెరువులోకి నేరుగా వదలడం వల్ల విష వాయువులు విడుదలై చేపలు తీవ్ర ఒత్తిడికి గురై చనిపోయే ప్రమాదం ఉన్నది.
ఒకే సైజ చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలి. లేదంటే చిన్న సైజు చేపలకు మేత అందక మరుగుజ్జుగా ఉండిపోతాయి.
సంచుల పద్ధతి ద్వారా చేపలకు ఆహారాన్ని అందించాలి. మేత సద్వినియోగంతో పాటు ఖర్చును, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
చేపలకు సోకే పరాన్నజీవుల నివారణకు పురుగుమందులు, రసాయనాలు వాడకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలో సాయంత్రం వేళలో మాత్రమే వాడాలి.
చేపల ఆరోగ్య పరిరక్షణ ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యన పరిశీలించాలి. దీని వల్ల రైతుల్లో అవగాహన పెరుగుతుంది.
నెలకు ఒకసారి, లేదంటే నీరు కలుషితం అయినప్పుడు అడుగు తూముల ద్వారా 1/3 వంతు నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టడం వలన చేపల పెరుగుదల బాగా ఉంటుంది.