ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించగా ఆమె పాల్గొని నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా పలు సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాల వేసి ఐలమ్మ ధీరత్వాన్ని గుర్తు చేశారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 26 : తెలంగాణ సమాజానికి ప్రశ్నించడం నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సమాజం ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నదని అన్నారు. ఐలమ్మ చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని కొనియాడారు. సమాజాభివృద్ధి కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ తెగువకు, మహిళా చైతన్యానికి ఐలమ్మ జీవితం ప్రతీకగా నిలుస్తుందన్నారు. మాటలని తూటాలుగా మలిచి దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు రాజేశ్, భరత్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
వీర వనిత చాకలి ఐలమ్మ
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 26 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అభివర్ణించారు. ఆడది అబల కాదు సబల అని, ఆదిశక్తి అని ఆ రోజుల్లోనే నిరూపించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో మంది వీరులకు, వీరవనితలకు పుట్టినిల్లు అని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, కులసంఘాల ప్రతినిధులు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వడ్డెమాను శ్రీను, ముదిగొండ రాము, జూపెల్లి నాగేశ్, మాటూరి బాల్రాజ్ పాల్గొన్నారు.