సూర్యాపేట టౌన్/ నీలగిరి/ నందికొండ/ మిర్యాలగూడ టౌన్, జూలై 11 : నాలుగో విడుత జ్వర సర్వేను పటిష్టంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వైద్య అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం సూర్యాపేటలో వైద్య అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి, నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేటలో హెలికాప్టర్ ద్వారా పర్యటించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పీహెచ్సీల పరిధిలో నమోదైన పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తికి గల కారణాలు, నియంత్రణపై చర్చించారు. సాగర్, పెద్దవూర పీహెచ్సీల పరిధిలో 4శాతం పాజిటివ్ ఉండటానికి గల కారణాలు, నియంత్రణ, చికిత్స చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి జ్వర సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.
సర్వేలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఐసొలేషన్ కిట్లు అందించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి 3 నుంచి 5 రోజుల్లో ఎవరితో కలిశారో గుర్తించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కొవిడ్ వచ్చిన వారిని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో చేర్పించి మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. జిల్లాల సరిహద్దులో నిఘా పెంచాలని, మండల, జిల్లా స్థాయి బృందాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కరోనా టెస్టులు పెంచాలని, పీహెచ్సీల్లో మందులను అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆదేశించారు. కొవిడ్ కేసులున్న ప్రాంతాల్లో స్థానిక సంస్థ్ధల కలెక్టర్ విస్తృతంగా పర్యటించి సమీక్షలు జరుపాలని, వైద్యారోగ్య శాఖ అధికారి స్వయంగా పర్యటించి నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జి.శ్రీనివాస్రావు మాట్లాడుతూ కేరళలో 10శాతం పాజిటివ్ కేసులు, పక్క రాష్ర్టాల్లో 5 నుంచి 10శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలో జనం రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు 2శాతం ఉండగా, నల్లగొండ జిల్లాలో 2.5 శాతం ఉందన్నారు. పాజిటివిటీ తగ్గించాలని, కేసులు ఎక్కువగా నమోదయ్యే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహాన్, డీఎంహెచ్ఓ అన్నిమళ్ల కొండల్రావు, డీసీహెచ్ఎస్ మాతృ, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రాథోడ్ జైసింగ్, డీపీఓ విష్ణువర్ధన్, వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. సూర్యాపేటలో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, ఏరియా దవాఖాన పర్యవేక్షకులు, డీఐఓ, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.