నేరేడుచర్ల, జనవరి 7:పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు సాధించేందుకు సర్కారు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఈ సారి వంద శాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక నజర్ పెట్టారు. అదనపు తరగతులు, టెస్ట్లు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఏప్రిల్ 3 నుంచి 11 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్ ముగించగా.. ముఖ్యమైన విభాగాలపై విద్యార్థులకు లోతుగా అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి పాఠశాలల్లో ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం ఒక సబ్జెక్టు, సాయత్రం ఒక సబ్జెక్టుపై విద్యార్థులకు అర్థమయ్యేలా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలపై తిరిగి విద్యార్థులు తమకు అర్థమైన విధంగా విశ్లేషణ చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు విద్యార్థులు చదివినదంతా ఎంత వరకు గుర్తుందనే విషయంలో సబ్జెక్టుల వారీగా చర్చింకుంటున్నారు. అలాగే, వారం వారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రత్యేక తరగతులతో ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంగా పెట్టకున్నారు. అయితే.. ఉదయం పూట ప్రత్యేక తరగతులకు పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమాయానికి గంట ముందుగానే అల్పాహారం తినకుండా వస్తున్నారు. వారికి అల్పాహారం అందించేందుకు లయన్స్ క్లబ్, ఇతర దాతలు ముందుకు రావాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి
పదో తరగతి చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యను బోధిస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పూట స్వచ్ఛంద సంస్థల సహకారంతోఅల్పాహారం అందిస్తున్నాం.
– బట్టు మధు, ప్రధానోపాధ్యాయుడు, దిర్శించర్ల