నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నదే పల్లె ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సభలు నిర్వహించి, ప్రతి ఒక్కరి ఇల్లు ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా వీధులను, గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే పల్లె ప్రగతి కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. భగీరథ పథకం తాగునీటి గోసను తీర్చింది. విషం లాంటి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఆసరా పెన్షన్ లు సమాజంలో పెను మార్పును తీసుకొచ్చాయి. ఈ కరోనా కష్ట సమయంలో కూడా రైతుబంధు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. వైకుంఠదామంల నిర్మాణంతో గ్రామాల్లో అంత్యక్రియలు హుందాగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటి పెంచాలని పేర్కొన్నారు.