నల్లగొండ : నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. మంగళవారం వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, అదనపు ఎస్పీ నర్మద, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు, విత్తన విక్రయ డీలర్లు, దుకాణదారులతో జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతాంగం నష్టపోకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు.
450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ రూ. 764గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అంతకుమించి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా గ్లైఫోసైట్ అమ్మకాలు లేవని, విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ అధికారుల సమన్వయంతో మండల, జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లాకు ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి అధికంగా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. రవాణాను అరికట్టేందుకు అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు.
వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను సమర్ధవంతంగా అరికట్టడానికి అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలు జరగకుండా పోలీసుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా హెచ్డీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. చాలా మంది లైసెన్స్దారులు నేరమని తెలిసినా అధిక లాభాల కోసం విక్రయిస్తున్నారని తెలిపారు.
జిల్లాలో పత్తి సాగుకు అవసరమైన నాణ్యమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై రైతులకు రైతుబంధు సమితి సభ్యుల ద్వారా చైతన్యం చేయాలని నిర్ణయించాం. అందుకు అనుగుణంగా అవగాహన సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్, వ్యవసాయ శాఖాధికారి హుస్సేన్ బాబు, పోలీస్, వ్యవసాయ శాఖాధికారులు, విత్తనాల కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, దుకాణదారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.