స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిని ఇంకా నిరక్షరాస్యులుగానే ఉండాలా..? పేదలు చదువుకోవద్దా..? పేద విద్యార్థుల చదువు అంటే అంత చులకనా..’ అంటూ కేంద్ర
ప్రభుత్వంపై మంచికంటి యాదగిరి విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై భారం పడకుండా నిస్వార్థంగా సేవలు
అందిస్తుంటే కేంద్రం అక్కసు వెల్లగక్కడం ఏంటని మండిపడుతున్నారు. బీజేపీ నిర్వాకంతోనే ట్రస్టుకు కష్టాలు వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు. పైసలు రాకపోవడంతో ట్రస్టు
మూతపడితే ప్రస్తుతం లక్షల్లో దోపిడీ చేసే ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలను ఎలా చదివించాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వెంటనే స్పందించి ట్రస్టుకు నిధులు విడుదలయ్యేలా
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర నిర్వాకం ఇదీ..
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో 2003 నవంబర్ 10న మంచికంటి యాదగిరి ట్రస్టు ఏర్పాటు చేసి విద్యాసంస్థను ప్రారంభించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో
ఉచిత విద్యను అందిస్తున్నారు. స్కూల్, కాలేజీ కలిపి మొత్తం 1,200 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 26 గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. క్లాస్
రూమ్లు, విశాలమైన గ్రౌండ్, మంచి నీటి సదుపాయం, టాయిలెట్లు, పార్కు, అనుభవజ్ఞులైన స్టాఫ్, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇంటర్ విద్యార్థులు ఇతర ప్రాంతాల
నుంచి రావడానికి ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే, 2016లో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకట్ట వేసింది. తీవ్రవాదులు,
నక్సలైట్లు, కొన్ని మిషనరీలు, ఇతర అసాంఘిక సంస్థలకు విదేశాల నుంచే వచ్చే నిధులను ఆపేసింది. ఇందులో భాగంగానే మంచికంటి యాదగిరి ట్రస్టుకు కూడా నిధులు
రాకుండా అకౌంట్ బ్లాక్ చేసింది. తమ ట్రస్టు వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. నిధులు రాకపోవడంతో స్కూల్, కాలేజీ
నిర్వహణ కష్టంగా మారింది. స్టాఫ్కు జీతాలు, మెయింటెనెన్స్ ఇతర ఖర్చులకు ఇబ్బంది అవుతున్నది. ఇప్పటికే ఆరేండ్ల నుంచి నిధులు రావడం లేదు. మంచికంటి లక్ష్మయ్య
తన సొంత డబ్బుల నుంచి ఖర్చు చేస్తున్నారు. ఇలా అయితే త్వరలోనే ఈ విద్యాసంస్థ మూతపడే ప్రమాదం ఉందని మేనేజ్మెంట్, స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు.
మా పిల్లల చదువులు ఆగం చేస్తరా?
మేమంతా వ్యవసాయం చేసుకునేటోళ్లం. పిల్లలను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించే స్థోమత లేదు. పిల్లల భవిష్యత్ను దెబ్బతీసేలా కేంద్రం తీరు ఉంది. ఇంత బాధపడటానికి
కారణం మోదీనే. ఆయన వల్లే నిధులు ఆగిపోయాయి. పిల్లలకు చదువు చెప్తున్న ట్రస్ట్ అకౌంట్ను కనీసం సోయి లేకుండా ఎట్ల బ్లాక్ చేస్తరు..? పేద పిల్లల చదువులను ఆగం
చేస్తున్నరు. ఇలా చేయడం సరికాదు. నిధులు వచ్చేలా చొరవ తీసుకోవాలి. లేకుంటే తగిన మూల్యం తప్పదు.
– కందికట్టె యాదయ్య, అంజయ్య, సూరారపు యాదయ్య, బోడంగిపర్తి (విద్యార్థుల తల్లిదండ్రులు)
బీజేపీకి ఓటు వేసేది లేదు..
కేంద్రం ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నది. అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నది. మంచికంటి యాదగిరి ట్రస్ట్కు నిధులు ఆపి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది.
తల్లిదండ్రులమంతా ఇటీవల సమావేశం నిర్వహించుకున్నాం. కేంద్ర విధానాన్ని అందరం తప్పుబట్టాం. నిధులు ఆగడంతో విద్యాసంస్థ మూతపడే ప్రమాదం ఉంది. ఇట్లాంటి
బీజేపీకి అసలే ఓటు వేయం.
-ఎస్కే సాదిక్, బోడంగిపర్తి
పేద విద్యార్థులు చదువుకోవద్దా..?
నేను సీఈసీ సెకండియర్ చదువుతున్నాను. ఫస్టియర్లో 489 మార్కులు వచ్చాయి. మేమంతా నిరుపేద విద్యార్థులం. డబ్బునోళ్లు అయితే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు వెళ్లి
చదువుకుంటారు. మేమంత భారం మోయలేం. మా తల్లిదండ్రులు చిన్నాచితక పని చేసుకుంటేనే పూట గడుస్తుంది. ఇలాంటిది ఓ మంచి కాలేజీలో ఉచితంగా చదువుకుంటే
మోదీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. పేదలు చదువుకోవద్దా..? ఇంకా నిరక్షరాస్యులుగానే ఉండాలా..? ఇదేం పద్ధతి. కేంద్రం మా కాలేజీపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి
తీసుకోవాలి.
– రాజేశ్వరి, ఇంటర్ సెకండియర్, కొండాపురం
చదువులపై భారం మోపవద్దు
నేను ఇంటర్ సెకండియర్ సీఈసీ చదువుతున్నాను. ఈ కాలేజీలో ఉన్న సదుపాయాలు కార్పొరేట్ కళాశాలలో ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపడం సరికాదు.
అకౌంట్ బ్లాక్ చేసే ముందు కనీసం వివరాలు తీసుకోవడం, విచారణ చేయడం వంటి చేయాలి కదా..? ఏం చేయకుండా ఉన్న పళంగా అకౌంట్ బ్లాక్ చేస్తే ఎలా..? భవిష్యత్లో
మిగతా వాళ్లు ఎలా చదువుకుంటారు. ప్రైవేట్కు పోతే లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. మా చదువులపై భారం మోపుకుండా చర్యలు తీసుకోవాలి.
– నాగరాజు, సెకండియర్, లక్ష్మీదేవిగూడెం
నిధులు ఆపడం ఎంత వరకు కరెక్ట్?
నేను ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాను. ఫస్టియర్లో 463 మార్కులు వచ్చాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది. చండూరు నుంచి ప్రతిరోజూ ఉచితంగా
బస్సులో వస్తాను. ప్రశాంత వాతావరణంలో క్లాస్లు నడుస్తాయి. ఒక్కపైసా కూడా కట్టించుకోకుండా చదువు చెబుతున్నారు. ఆఖరికి అప్లికేషన్ ఫీజు కూడా కాలేజీనే
కడుతుంది. ఇక్కడ చదవడం గర్వకారణంగా ఉంది. ఇలాంటి కాలేజీకి కేంద్రం నిధులు ఆపడం ఎంత వరకు కరెక్ట్..? ఇది సరైన విధానం కాదు.
– శ్రీవిద్య, ఇంటర్ సెకండియర్, చండూరు
పేదల ఉసురు తగుల్తది
నా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. బయటకు ఎల్కేజీ చదివిస్తనే కనీసం రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ప్రైమరీ, హైస్కూల్, కాలేజీలో ముగ్గరూ ఇక్కడే
చదువుకుంటున్నారు. ఒక్కపైసా కట్టకుండా ఉచితంగా చదువు చెబుతున్నారు. బయట చదివితే ఏడాదికి కనీసం రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు
నిధులు ఆపితే పిల్లలను ఎక్కడ చదివించుకోవాలి..? విద్యాసంస్థ మూతపడితే కేంద్రానికి మా ఉసురు తగుల్తది.
– లక్ష్మమ్మ, పేరెంట్, బోడంగిపర్తి
మాలాంటి పేదలే నష్టపోతరు..
నేను ఇంటర్ ఫస్టియర్ సీఈసీ చదువుతున్నాను. మంచి కాలేజీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కావడంతో మునుగోడు నుంచి వచ్చి చదువుకుంటున్నా. బస్సు సౌకర్యం ఉంది. బస్సు చార్జీకి
కూడా ఒక్కపైసా తీసుకోరు. ఉగ్రవాదులు, వాటిని ప్రోత్సహించే మిషనరీలకు ఆపితే బాగుంటుంది. మా లాంటి నిరుపేదలు చదువుకునే విద్యాసంస్థకు ఆపితే ఏం వస్తది..?
ట్రస్టుకు ఏం కాదు. మాలాంటి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మేమే నష్టపోతం.
– ప్రవీణ్, ఫస్టియర్, మునుగోడు
నిస్వార్థంగా సేవ చేస్తుంటే అడ్డగింతలేంది..?
ఆరేండ్ల నుంచి నిధులు రాకుండా కేంద్రం మంచికంటి ట్రస్టు అకౌంట్ను బ్లాక్ చేసింది. నెలకు సుమారు రూ.12 లక్షల దాకా నిర్వహణ ఖర్చు అవుతున్నది. విదేశాల నుంచి
నిధులు ఆగిపోవడంతో మెయింటెనెన్స్ ఇబ్బందిగా మారింది. మంచికంటి లక్ష్మయ్య సొంతంగా ఖర్చు చేస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తుంటే కేంద్రం అడ్డుకోవడం సరికాదు.
వందల మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– మల్లయ్య, ప్రిన్సిపాల్