నల్లగొండ : పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లోని ప్రధాన రహదారుల వెంట బహుళ అంచల్లో మొక్కల పెంపకం చేపట్టాలని కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ నల్లగొండ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో డాక్టర్ సత్యనారాయణ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు హరితహారం అమలు తీరును పర్యవేక్షించారు. గ్రీన్ బడ్జెట్ వ్యయం, జీతాల చెల్లింపులపై సైతం వివరాలడిగారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ఆకస్మికంగా జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎవెన్యూ ప్లాంటేషన్, నాటిన మొక్కలు ఏ మేరకు బ్రతికాయన్న దాన్ని సీఎం పరిశీలించనున్నట్లు చెప్పారు.
సుందరీకరణ కోసం పట్టణాల్లో తొందరగా పూలు పూచే మొక్కలను నాటాలన్నారు. అంచనాలను సిద్ధం చేసి వారంలోపు పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణంలో అభివృద్ధి చేసిన నర్సరీల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీలను సందర్శించే అధికారుల సూచనలను ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలన్నారు.
వానాకాలం నేపథ్యంలో పట్టణంలోని మురికికాలువల్లో పూడికతీత చేపట్టాలన్నారు. ఇది డ్రైనేజీ కాలువలు పొంగి ప్రవహించకుండా చేస్తుందన్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి వ్యర్థాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణాల్లోని ప్రభుత్వ మరుగుదొడ్లను పరిశీలించి, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణాల్లో వైకుంఠ ధామాల ఏర్పాటుకు మూడు ఎకరాల భూమిని కూడా అధికారులు గుర్తించాలన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కనీసం నాలుగు వైకుంఠ ధామాలు ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మ, జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.