నల్లగొండ : బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గోదావరి నీటిని పాలేరు రిజర్వాయర్ అటునుంచి పెద్దదేవులపల్లి చెరువు ద్వారా పంప్ చేసి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు.
అదేవిధంగా దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామన్నారు. ఇదే కనుక జరగకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బుధవారం హాలియాలో బహిరంగ సభను నిర్వహించింది.
సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు, తన వాగ్ధానాలను గమనించి ప్రజలు ఓటేయాల్సిందిగా కోరారు. కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.