కర్నల్ సంతోష్బాబు విగ్రహావిష్కరణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట, జూన్ 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీరచక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు విగ్రహాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆవిష్కరిస్తారు. పాత వ్యవసాయ మార్కెట్లో రూ.20కోట్ల వ్య యంతో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ ప్రాంగణంలో మరో రూ. 8కోట్ల వ్యయంతో నాలుగు బ్లాకులకు శంకుస్థాపన చేయనున్నా రు. అనంతరం రూ.21కోట్లతో కోర్టు నుంచి ఎస్వీ డిగ్రీ కళాశాల వరకు మెయిన్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. తిరిగి నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం భీమారంలో రైతువేదిక, వైకుంఠధామం, స్కూల్ భవనాలను, నకిరేకల్ మున్సిపాలిటీలో అన్ని హంగులతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించనున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన 100 పడకల ఏరియా దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఆధునిక నాన్ వెజ్ మార్కెట్ తోపాటు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పునాదిరాయి వేయనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నమస్తే తెలంగాణ’కు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తో సహకరిస్తున్న మంత్రి కేటీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో, డీఎస్పీ ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో మహావీర చక్ర కర్నల్ సంతోష్బాబు కాంస్య విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్లోని జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో తయారైన 9.6అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేర్చి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్బాబు త్యాగం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా సూర్యాపేటకు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ దీపికాయుగేందర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ ఉన్నారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి చివ్వెంల మండలం బండమీది చందుపట్ల ఊర చెరువును పరిశీలించారు. చేపల కాంట్రాక్టర్లు చెరువు నీటిని ఖాళీ చేశారని రైతులు చెప్పడంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎంపీపీ కుమారీబాబూనా యక్, జడ్పీటీసీ సంజీవ్నాయక్, సుధీర్రావు, కృష్ణ పాల్గొన్నారు.