యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం వాసాలమర్రిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీసీపీ నారాయణరెడ్డి, డీపీఓ సాయిబాబా, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులతో కలిసి గ్రామంలోని దళితవాడతోపాటు గ్రామం మొత్తం తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు. సమావేశం నిర్వహించనున్న రైతు వేదిక భవనాన్ని, గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. స్థానికంగా అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధిపై చర్చించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భూపాల్రెడ్డి, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ దుర్గేశ్వరి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్కుమార్ ఉన్నారు.
వాసాలమర్రి ప్రస్థానమిది..
అక్టోబర్ 31, 2020 : జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన కేసీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించగా.. సమస్యలపై చర్చించేందుకు ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్కు రావాల్సిందిగా సూచించారు.
నవంబర్ 1, 2020 : ఫాం హౌజ్కు వెళ్లిన సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఇతర గ్రామస్తులతో ముచ్చటించి.. గ్రామ సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంకాపూర్ తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. 100కోట్లు ఖర్చైనా సరే! వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ది చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
నవంబర్ 6, 2020 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నవంబర్ 16 వరకు ఇంటింటి సమగ్ర సర్వేను నిర్వహించారు. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారుల బృందం వాసాలమర్రిలో పర్యటించి గ్రామ అభివృద్ధితోపాటు, స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై బ్లూప్రింట్ రూపొందించి సిద్ధం చేశారు.
నవంబర్ 17, 2020 : యశోద హాస్పిటల్ యాజమాన్యం వాసాలమర్రిలో హెల్త్ క్యాంపును నిర్వహించింది. 40 మంది వైద్య బృందం శిబిరంలో వైద్య సేవలను అందించింది. మొత్తం 1,118 మందిని పరీక్షించి ఉచితంగా మందులను సైతం అందజేశారు.
నవంబర్ 18, 2020 : అభివృద్దిలో ఆదర్శంగా నిలవడంతోపాటు, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామ సందర్శనకు మొత్తం 284 మంది గ్రామస్తులు వెళ్లారు. అక్కడి గ్రామస్తులు సమిష్టిగా సాధించిన అభివృద్ధిని కళ్లారా చూసి వచ్చారు.
జూన్ 22, 2021 : ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు, గ్రామ సభ నిర్వహించి వాసాలమర్రి సమగ్ర అభివృద్దిపై కూలంకుషంగా చర్చించారు. ఐక్యతతో గ్రామాన్ని అభివృద్ధి పథాన నిలపాలని తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్భోదించారు. వాసాలమర్రి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని 421 పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, ఇతర ఐదు మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ఇదే వేదికపై ప్రకటించారు.