యాదాద్రి, అక్టోబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం స్వామి వారికి సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో కొత్తగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు.
సాయంత్రం రామలింగేశ్వరుడిని శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరస్వామి ఆలయంలో గాయత్రీ జపాలు, మధ్యాహ్న పూజ జరిపారు. సాయంత్రం దుర్గాష్టమి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో చండీహవనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ, శివాలయ ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహరాములు శర్మ, అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు. స్వామివారిని సోమవారం సుమారు 9,642 మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.18,97,076 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు. జిల్లా న్యాయమూర్తి బాలభాస్కర్ స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాన్ని అందించారు.