నల్లగొండ/గుర్రంపోడు, జూలై 30 : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్ విడుదలైంది. శ్రీశైలం నుంచి వరద రాకతో సాగర్ జలకళ సంతరించుకోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. హైలెవల్ ప్రాజెక్టు కింద 2.20లక్షల ఎకరాలు, లెవల్ ప్రాజెక్టు కింద 80వేల ఎకరాలు ఉండగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందించనున్నారు. తొలి విడుత ఆగస్టు 10న ప్రారంభించి డిసెంబర్ 15వరకు 8రోజుల పాటు నీరందించి 7రోజులు బంద్ పెట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా పీఏ పల్లి మండలంలోని ఏకేబీఆర్ నుంచి కేతేపల్లి వరకు ఏఎమ్మార్పీ ద్వారా సాగునీరందుతుంది. మొత్తంగా 55 డ్రిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. గడిచిన నాలుగేండ్లుగా సాగర్ ప్రాజెక్టు నిండుతుండడంతో ఏఎమ్మార్పీకి సైతం ఏటా నీరందిస్తున్నారు. డీ-5 నుంచి డీ-55 వరకు ప్రతి రోజూ 1500క్యూసెక్కులు చొప్పున మొత్తంగా 17టీఎంసీలు ఇవ్వాలని ఇరిగేషన్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఎస్ఈ అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.