స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం కొత్తగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఇప్పటికే సురక్ష బీమా పథకాన్ని అమలు చేస్తుండగా తాజాగా సురక్ష (బి) పథకం చేపట్టింది. ఈ బీమా ద్వారా సంఘంలోని ప్రతి సభ్యురాలి కుటుంబానికీ ధీమా కలుగనుంది. సభ్యురాలు ఏదైనా కారణంతో మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష బీమా అందుతుంది. ఆమె పేరిట బ్యాంకులో ఉన్న రుణం మాఫీ అవుతుంది. ఈ పథకంలో చేరేందుకు ఆగస్టు నెలాఖరు వరకు అవకాశం ఉంది. పథకం అమలుకు జిల్లా స్త్రీనిధి అధికారులు స్వశక్తి సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏటా రూ.230ప్రీమియం, మూడేండ్లకు రూ.690చెల్లించి సురక్ష(బి)పథకంలో చేరాలి. సంఘంలో సభ్యులుగా ఉండి గతంలో పలు పథకాల్లో రుణాలు తీసుకున్న వారికి, సంఘంలో ఉండి ఇప్పటి వరకు ఏ రుణం తీసుకోని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే రుణం తీసుకోని వారు అదనంగా రూ.100ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మరణిస్తే రూ.లక్ష చెల్లింపు…
సంవత్సరానికి రూ.230చొప్పున మూడు సంవత్సరాల ప్రీమియం రూ.690చెల్లించాలి. సభ్యులు మరణిస్తే తక్షణ సహాయం కింద రూ.5వేలు చెల్లిస్తారు. తర్వాత రూ.95వేలు సదరు గ్రామ సమాఖ్య ద్వారా చెల్లిస్తారు. మృతి చెందిన సభ్యురాలికి సంబంధించిన వివరాలను అందజేసినందుకు గ్రామ సంఘానికి రూ.500చెల్లిస్తారు. బీమా చేసుకున్న సభ్యురాలు మరణిస్తే ఆమె బ్యాంకులో తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తారు. చెల్లించిన వాయిదాల్లో కొంత మొత్తాన్ని తిరిగి నామినీకి అందజేస్తారు.
బీమాలో చేరండిలా…
డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలి.
సభ్యురాలి వయస్సు 18-60ఏండ్ల మధ్య ఉండాలి.
ఏదైనా గుర్తింపు కార్డు(ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, విద్యార్హతల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్)తో దరఖాస్తు చేసుకోవాలి.
సభ్యుల తీర్మానం మేరకు పథకంలో చేరాలి. సభ్యులందరూ చేరాలనే నిబంధన ఏమీ లేదు.
బీమా పథకం ప్రీమియం డబ్బులను స్త్రీనిధి అప్పుగా ఇస్తుంది.
ఒక్కో సభ్యురాలు నెలకు రూ.22చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక వడ్డీతో 24వాయిదాల్లో చెల్లించాలి.
అర్హులైన వారందరినీ చేర్పిస్తాం…
జిల్లాలో అర్హులైన వారందరినీ సురక్ష బీమా పథకంలో చేర్పిస్తాం. ప్రీమియం చెల్లించని పరిస్థితుల్లో ఉన్న వారికి స్త్రీనిధి ద్వారా రుణాలు సైతం తక్కువ వడ్డీతో మంజూరు చేయిస్తాం. పథకంలో చేరేందుకు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం.