కేతేపల్లి, జూన్ 29 : మూసీ కాల్వల ఆధునికీరణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశించారు. మండలంలోని కాసనగోడు శివారులో కాల్వ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాల్వకు ఇరువైపులా మట్టితో చదును చేయాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో వంతెనలు నిర్మించాలని సూచించారు. ఆయన వెంట డీఈఈ చంద్రశేఖర్, ఏఈలు మమత, ఉదయ్ ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నార్కట్పల్లి : మండలంలోని 20మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నార్కట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి అందించారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, యానాల అశోక్రెడ్డి, దోసపాటి విష్ణుమూర్తి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నకిరేకల్ 8వ వార్డులో పర్యటన..
కట్టంగూర్(నకిరేకల్) : నకిరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే లింగయ్య మార్నింగ్ వాక్లో భాగంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కట్టంగూర్ మండలంలోని తాటికల్లుకు చెందిన పరెడ్డి మధుసూదన్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి సానుభూతి తెలిపి రూ.30 వేల సాయం అందించారు.