చివ్వెంల, జూన్ 26 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద శనివారం హైదరాబాద్-విజయవాడ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమగోదావరి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఏస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం వివరాలివీ.. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి డివైడర్ దాటుకుని రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న కారు డీసీఎం కిందికి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కౌజు శ్రీనివాస రావు(35) గరికపాటి రామకృష్ణ (35) అక్కడికక్కడే మృతిచెందారు. స్నేహితులైన వీరు సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు మొత్తం డీసీఎం కిందికి దూసుకెళ్లడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పోలీసులు క్రేన్ను తెప్పించి కారును వెలికితీశారు. సుమారు రెండు గంటల సమయం పట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన తీరుపై అక్కడ గుమికూడిన ప్రజలు సైతం కంటతడి పెట్టారు.