నల్లగొండ, జూన్ 20 : నెల్లికల్ లిఫ్టుశంకుస్థాపనకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని గ్రామ పంచాయతీలతోపాటు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలను అభివృద్ధ్ది చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున రూ.168.80 కోట్లు, ఒక్కో మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున 31 మండల కేంద్రాలకు రూ.9.30 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు ఇచ్చిన సీఎం మిర్యాలగూడకు రూ.5 కోట్లు, నందికొండ, దేవరకొండ, చిట్యాల, చండూర్, హాలియా, నకిరేకల్ మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మరో రూ.6కోట్లు మంజూరు చేశారు.
జిల్లాను అభివృద్ధి చేద్దామనే..
రాష్ట్రంలో పెద్ద జిల్లాలో ఒకటైన నల్లగొండ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిత్యం ఆలోచన చేస్తూనే నిధులు కూడా కేటాయిస్తున్నారు. దీంతోపాటు జిల్లాలో ఎక్కువగా ధాన్యం పండుతున్నప్పటికీ మద్దతు ధర అందించి పూర్తి ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి పలుమార్లు నిధులు అందించిన సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్లో నెల్లికల్ లిఫ్టు మంజూరు సందర్భంగా ఏర్పాటు చేసిన ధన్యవాద సభకు వచ్చి జిల్లా అభివృద్ధికి వరాలు ప్రకటించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నిధులు విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం పరిపాలనా అనుమతులు సైతం మంజూరయ్యాయి.
మరింత అభివృద్ధ్ది చెందనున్న నల్లగొండ
నల్లగొండ జిల్లా అభివృద్ధికి పట్టణ, పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయిస్తూనే ఉంది. గడిచిన 22 నెలలుగా గ్రామాలకు నెలకు రూ.20 కోట్ల చొప్పున మొత్తంగా రూ.440 కోట్లు విడుదలయ్యాయి. ఆయా నిధులతో గ్రామాలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. ఇక సీఎం హామీ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షలు రాగా వాటితో మరింత అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పట్టణ ప్రగతికి వచ్చే నిధులకు తోడు సీఎం కేసీఆర్ విడుదల చేసిన ప్రత్యేక నిధులతో పట్టణాలు సైతం మరింత అభివృద్ధి చెందనున్నాయి.