నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ముందు నుంచీ టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థి ఖరారు కాకముందే ఆ పార్టీ ముఖ్య నేతలంతా ప్రజల్లోకి వెళ్లారు. మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జీల నియామకం చేసి రంగంలోకి దిగారు. ఇప్పటికే వాడవాడలా గడపగడపకూ టీఆర్ఎస్ ప్రచారం ఒకటికి పలుమార్లు చేరింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రధాన ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్తున్నది. దీంతో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది.
పూర్తి వ్యవసాయాధారిత నియోజకవర్గమైన నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న 24గంటల ఉచిత కరెంటుతోపాటు రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇక ప్రతి గింజనూ కొనుగోళ్లు చేస్తూ రైతు ప్రభుత్వంగా నిలువడంతో ప్రచారంలో అదేస్థాయిలో స్పందన లభిస్తున్నది. సాగర్ ఆయకట్టుకు నిక్కచ్చిగా సాగునీటి వాటా, కొత్తగా లిఫ్టు పథకాల మంజూరులాంటివి ప్రచారంలో కీలకంగా ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా 1.53లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. వీరందరినీ టీఆర్ఎస్ నేతలు కలుస్తూ ఓట్లు అడుగుతున్నారు.
14న సీఎం కేసీఆర్ సభకు సన్నద్ధం
ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4గంటలకు హాలియాలోని పెద్దవూర రోడ్డులో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భారీ బహిరంగసభకు పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. జనం భారీగా తరలిరావచ్చనే అంచనాతో 20ఎకరాల ప్రాంతంలో సభాస్థలం, మరో 40 ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండవేడిమి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బీజేపీ అభాసుపాలు..
బీజేపీ రాష్ట్ర నేతలంతా తమ అభ్యర్థి రవినాయక్ తరుఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రోడ్షో చేస్తుండగా ఇతర నేతలు కూడా సాగర్కు చేరుకున్నారు. చార్జ్షీట్ దాఖలు అంటూ పసలేని ఆరోపణలతో అభాసుపాలయ్యారు. ఇక శనివారం మ్యానిఫెస్టో అంటూ విడుదల చేశారు. నియోజకవర్గంలో పెద్దగా క్యాడర్లేని పార్టీగా ఉన్న బీజేపీ ప్రచారానికి అంతంత మాత్రంగానే స్పందన కనిపించింది.
మంత్రుల నుంచి కార్యకర్త వరకు..
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాడ్గులపల్లి, త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర, నిడమనూరు మండల్లాల్లో ప్రతి పల్లెనూ చుట్టివచ్చారు. తిరుమలగిరిసాగర్ మండలంలోనూ మొదటి రోజు ప్రచారం సాగింది. అభ్యర్థి భగత్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డి ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తుండగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావుతోపాటు ప్రతి కార్యకర్త ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. ఆయా మండలాల్లో ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు.
వ్యక్తిగత దూషణలకే కాంగ్రెస్ పరిమితం
ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తడబాడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదని ఆపార్టీ వర్గాలే చెబుతున్నాయి. నామినేషన్ అనంతరం ఎక్కువగా ఇంటికే పరిమితమై ఫోన్లలోనే గ్రామాల్లోని ముఖ్యులను పలుకరిస్తున్నట్లు తెలిసింది. ముందుగా ప్రతి గ్రామానికి వెళ్లాలని భావించినా అది సాధ్యపడడం లేదని సమాచారం. ఆయన కుమారులే గ్రామాల్లో ముఖ్య నేతలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఒక్కరోజే ప్రచారం చేశారు. మిగతా నేతలు ఇలా వచ్చి అలా వెళ్తున్న వారే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ముఖ్య నేతలంతా వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారు. పార్టీలోని వర్గపోరుతో రేవంత్రెడ్డి ఒకవైపు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోవైపు పోటాపోటీగా రోడ్షోలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.