నల్లగొండ, మే 30: కరోనా కష్ట కాలంలోనూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. దీంతో పాటు వానకాలం సీజన్కు సిద్ధం అవుతున్న అన్నదాతకు జూన్ 15 నుంచి రైతుబంధు సాయం అందచేయాలని నిర్ణయించింది. ఈ సారి పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి మారిన రైతులకు సైతం రైతు బంధు అందజేయనున్నది. 2018వానకాలం సీజన్ నుంచి రైతులకు ఎకరాకు తొలి రెండు విడుతలు రూ.4వేలు, తర్వాత నాలుగు విడుతలు రూ.5వేల చొప్పున అందించింది. మొత్తంగా నల్లగొండ జిల్లాలో 4.63లక్షల మంది రైతులకు రూ.611 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2.56లక్షల మంది రైతులకు రూ.313కోట్లు అందజేసింది. వచ్చే నెల 15నుంచి 25వరకు పెట్టుబడి సాయం అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
పార్ట్ ‘బీ’ నుంచి ‘ఏ ’లోకి వచ్చిన రైతులకూ..
జిల్లా వ్యాప్తంగా రైతాంగం వానకాలం సీజన్కు సిద్ధమవుతుండడంతో వారికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. స్థానిక సమస్యల కారణంగా అనేక మంది రైతుల భూముల వివాదాల్లో ఉండడంతో అధికారులు వారిని పార్ట్ బీలో పెట్టి పాస్పుస్తకాల జారీని నిలిపేసింది. ఇటీవల ధరణి అమలు తర్వాత కలెక్టర్లకు బాధ్యత అప్పగించటంతో పార్ట్ బీలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించి పార్ట్ ఏ లో చేర్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆరు వేల దరఖాస్తులకు పరిష్కారం లభించడంతో వారందరికీ ఈ సారి రైతుబంధు అందనుంది.
ఎకరాకు రూ.5వేల చొప్పున
2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు ప్రారంభించిన ప్రభుత్వం తొలి ఏడాది ఎకరాకు రూ. నాలుగు వేల చొప్పును ఇచ్చింది. ఆ తర్వాత ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున అందచేసింది. ఈ ఏడాది వానకాలం సీజన్కు కూడా ఎకరాలకు రూ.5వేల చొప్పున అందించేలా చర్యలు చేపట్టింది. ఇవి కూడా రైతులకు సకాలంలో అందించాలనే ఉద్దేశంతో వచ్చే నెల 15 నుంచి 25 వరకు పది రోజుల్లోనే అందరికీ అంద జేయాలని నిర్దేశించింది. పార్ట్ బీ నుంచి ఏ లోకి మారిన రైతులకు ఆర్థిక సాయం అందనుండగా వారంతా జూన్ 10తేదీ లోపు స్థానిక ఏఈఓల వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఫారెస్టు భూములు కలిగిన రైతులకు కూడా రైతుబంధు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనికి సంబంధించిన పోర్టల్ను జూన్ ఒకటి నుంచి రైతులకు అందుబాటులోకి తేనున్నది.
9.15 లక్షల మంది రైతులకు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 7.19 లక్షల మంది రైతులకు రైతుబంధు అందనున్నది. నల్లగొండ జిల్లాలో 4,63,928 మందికి రూ.611.53 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,56,385 మంది రైతులకు రూ.313.33 కోట్లు రైతుబంధు కింద అందనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,87,159 మంది రైతులకు రూ.210 కోట్ల ఆర్థిక సాయం అందనున్నది.
కొవిడ్ పరిస్థితుల్లోనూ..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో సర్కారు ఆర్థిక వనరులు గణనీయంగా పడిపోయి ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. అయినా రైతులు వానకాలం సీజన్లో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడవద్దనే సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాసంగి సిజన్లో రైతులు పండించిన ధాన్యానికి పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి కొనుగోలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విలీన బ్యాంకుల ఖాతాదారులు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి
ఇటీవల కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. వాటి బ్రాంచ్లు మారడంతో ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారింది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ప్రస్తుత బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్తో పాటు పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లి స్థానిక ఏఈఓల వద్ద ఎన్రోల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
విలీన బ్యాంకులివే..
ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్లో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి.
రైతుల సంఖ్య పెరిగే అవకాశం
జిల్లాలో గతంలో ఉన్న రైతులతో పాటు ఈ సారి కొత్తగా నమోదయ్యే వారూ ఉండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పార్ట్ బీలో కొనసాగిన రైతులు పార్ట్ ఏ లోకి మారటంతో వారంతా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వారి ఎన్రోల్కు అవకాశం ఇచ్చినందున సంఖ్య పెరుగనున్నది. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.63 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.611కోట్లు జమయ్యాయి. ఈ సారి ఈ మొత్తం కూడా పెరుగనున్నది.
-శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి,నల్లగొండ