ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలలా సాగునీటిని పారించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను ఆధునీకరించడంతోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటి పనుల్లో మరింత వేగం పెంచే దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నది. కృష్ణపట్టెకు మంజూరు చేసిన ఎత్తిపోతలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతోపాటు టెండర్లు పిలిచి ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సమన్వయ బాధ్యతలను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి అప్పగించడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. మూడ్రోజుల కిందట బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్లతోపాటు కాల్వల వెంట అధికారులతో కలిసి పర్యటించారు. బస్వాపూర్ రిజర్వాయర్ స్థలంలోనే అధికారులతో సమీక్షించారు. కొనసాగింపుగా శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య,గాదరి కిశోర్కుమార్తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, మే28(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలన్నింటికీ పూర్తి స్థాయి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను వచ్చే నెల 15 నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకాలన్నింటికీ ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన డీపీఆర్లు త్వరగా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ఏడాదిలోపే ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డీపీఆర్లు అందిన వెంటనే టెండర్లు పూర్తి చేసి సత్వరమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకదృష్టి సారించారని, అందుకు అనుగుణంగా లిఫ్టుల పను లు వేగంగా జరిగేలా ప్రణాళిక సిద్ధంచేయాలని సూచించారు.
నిరాటంకంగా గంధమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు
ఇదే సమయంలో ఆలేరు, భువనగిరి ప్రాంతాలను సస్యశ్యామలం చేసే బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్ల పనులు సైతం నిరాటంకంగా కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారు. జూలై 31 నాటికి బస్వాపూర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీనికి సంబంధించిన ప్యాకేజీ 14, 16పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించే ఎస్ఆర్ఎస్పీ 69,70,71 డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఆధునీకరణ పనులపైనా దృష్టి పెట్టారు. ఆధునీకరణ పనులకు ప్రతిపాదనలు మూడు రోజుల్లోగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణపట్టె లిఫ్టులకు త్వరలోనే టెండర్లు : మంత్రి జగదీశ్రెడ్డి
సమావేశం అనంతరం మీడియాతో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కృష్ణానదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను సిద్ధం చేసి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. పనులు ప్రారంభించిన ఏడాది లోపే వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో మిగిలి ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న అన్ని ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిరంతర సమీక్షలతో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాలను సస్యశ్యామలం చేసే బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్ పనులను ప్రత్యేక లక్ష్యంతో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సీజన్లోనే గోదావరి జలాలతో బస్వాపూర్ రిజర్వాయర్ కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఆధునీకరణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడమే దీని లక్ష్యమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోనూ మిగిలి ఉన్న పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. సమైక్య పాలనలో సాగునీటి కోసం గోసపడిని ఉమ్మడి జిల్లాను రానున్న రోజుల్లో పూర్తిగా సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, గజ్వేల్ ఈఎన్సీ హరేరామ్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు శ్రీకాంత్, రమేశ్బాబు పాల్గొన్నారు.