నీలగిరి, మే 28 : సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండేవారికి టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా తొలిరోజు పలు కేంద్రాల్లో టీకాలు వేశారు. నల్లగొండ జిల్లాలో 6,286 మందిని గుర్తించగా మొదటి రోజు 2,283 (36.3 శాతం) మందికి వ్యాక్సిన్ వేశారు. శని, అది వారాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు.
అందరి రక్షణకు..
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు బహుముఖ యుద్ధం చేస్తున్నది. ఒకవైపు కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూనే మరోవైపు వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నది. వ్యాక్సిన్తోనే వైరస్ నియంత్రణతోపాటు ప్రాణాలు నిలబెట్టొచ్చనే ఉద్దేశంతో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసింది. మొదటి విడుతగా వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశకార్యకర్తలను ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేయగా ఆ తర్వాత 45 సంవత్సరాలు దాటిన వారికి టీకాలు ఇస్తున్నది. ప్రస్తుతం సూపర్ స్ప్రెడర్లకు వేస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో 1463 మందికి వ్యాక్సిన్
సూర్యాపేట టౌన్, మే 28 : సూర్యాపేట జిల్లాలో 4,730 సూపర్ స్ప్రెడర్స్ను ఎంపిక చేయగా తొలిరోజు 14 కేంద్రాల్లో 1463 మందికి టీకాలు వేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో వ్యాక్సినేషన్ను ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్, ఎంఏఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను పరిశీలించారు. రెండు రోజుల ఈ ప్రత్యేక డ్రైవ్ను సూపర్స్ప్రెడర్స్ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇతరులకు 2,363 మందికి టీకాలు వేశారు. అందులో 1824 మందికి కొవిషీల్డ్, 539 మందికి కోవాగ్జిన్ వేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,47,924 మందికి టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రప్రసాద్, డీఎస్ఓ విజయలక్షి, డీఏఓ రామారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, తాసీల్దార్లు వెంకన్న పాల్గొన్నారు.
2,283 మందిలో..
నల్లగొండ జిల్లాలో 2,283 మందికి వ్యాక్సిన్ వేయగా ఇందులో 1894 మంది 18 నుంచి 44 ఏండ్లు, 289 మంది 45 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారు. ఇక మొత్తం సూపర్స్ప్రెడర్స్లో 1982 మంది రేషన్ డీలర్లతోపాటు వర్కర్లు ఉన్నారు. ఇందులో 575 మంది 18 నుంచి 44 ఏండ్ల లోపు, 150 మంది 45 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ బంక్ వర్కర్లు, డీలర్లు 1795 మంది కాగా 515 మంది 18 నుంచి 44 ఏండ్లలోపు, 72 మంది 45 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారు. జర్నలిస్టుల్లో అక్రిడిటేషన్ కలిగి 18-44 ఏండ్లలోపు వారు 182 మంది, 45 సంవత్సరాల పైబడిన వారు 27 మంది ఉన్నారు. అక్రిడిటేషన్ లేని జర్నలిస్టుల్లో 18-44 సంవత్సరాల వారు 87 మంది, 45 ఏండ్లు పైబడిన వారు 12 మంది ఉన్నారు. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాల్లో 1890 మందికిగాను 18-44 ఏండ్ల వారు 535 మంది, 45 సంవత్సరాల పైబడిన వారు 128 మంది ఉన్నారు.
ఇక నిర్భయంగా పని చేయొచ్చు
నిత్యం వందలాది మంది వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం వస్తుంటారు. కొవిడ్ బారిన పడే ప్రమాదముందని భయపడేవాడిని. మాకు వ్యాక్సిన్ ఎప్పటికి అందుతుందోనని ఆందోళన చెందేవాడిని. ప్రభుత్వం టీకా వేయించింది. ఇక నిర్భయంగా పనులు చేసుకుంటా.
-చెనగోని శంకర్, ఆపరేటర్, హెచ్పీసీఎల్ బంక్, మునుగోడు
టీకాపై అనుమానాలొద్దు
వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనే చాలా రోజులు అనుమానంతో ఉన్నాను. సూపర్ స్ప్రెడర్స్ తప్పకుండా టీకా వేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో వేసుకున్నా. టీకా వేసుకున్నాక ఏఇబ్బందీ రాలేదు.