కొవిడ్ రూల్స్కు అనుగుణంగా ఏర్పాట్లు : అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్28(నమస్తే తెలంగాణ) : నకిరేకల్ మున్సిపల్ పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ జరుగనున్నది. గురువారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రంలో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అప్పగించనున్నారు. మొత్తం 20 వార్డులకు 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 21382 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 250 మంది సిబ్బందిని, బందోబస్తు కోసం 400 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటించారు.
ఏర్పాట్లు పూర్తి
నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే ఆయా వార్డుల్లో అభ్యర్థుల సంఖ్య, ఓటర్లకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. అవసరమైన బ్యాలెట్ బాక్స్లను సమకూర్చారు. వీటన్నింటినీ నకిరేకల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రానికి చేరవేశారు. గురువారం ఉదయం డిస్ట్రిబ్యూటరీ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. అక్కడే వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించి, సామగ్రి అందిస్తారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి మధ్యాహ్నమే చేరుకుంటారు. రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాజిటివ్ ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా కల్పించారు.
21,382 మంది ఓటర్లు
కొత్తగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీలో 20వార్డులు ఉండగా మొత్తం 21382 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 10537 మంది పురుషులు, 10845 మంది మహిళలు ఉన్నారు. ఒక్కో వార్డులో సుమారు వెయ్యి మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 93 మంది అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ నుంచి మొత్తం 20 వార్డుల్లో అభ్యర్థులు ఉండగా, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి 14, ఫార్వర్డ్బ్లాక్ నుంచి 14, సీపీఎం నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఒక్కరు, 25 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దిగారు. ఒక్కో వార్డుకు రెండు చొప్పున 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఒక పీఓ, ఒక ఏపీఓ, ముగ్గురు ఓపీఓలు ఉంటారు. మొత్తం 200 పోలింగ్ సిబ్బందితో పాటు అదనంగా మరో 50 మందిని కూడా నియమించారు. వీరికి నేడు ర్యాండమైజేషన్ పద్ధతిలో విధులు కేటాయించనున్నారు. సిబ్బంది గురువారం సాయంత్రానికి పోలింగ్ సామగ్రితో పాటు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోనున్నారు.
400 మంది పోలీస్ సిబ్బంది
పోలింగ్ ప్రశాంతంగా, కట్టుదిట్టంగా నిర్వహించడంపై జిల్లా పోలీసు శాఖ దృష్టి పెట్టింది. పోలింగ్లో బందోబస్తు విధుల కోసం 400 మందిని నియమించింది. ఇందులో నలుగురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 40 మంది ఎస్ఐలతో పాటు 350 సిబ్బంది ఉన్నారు. వీరందరికీ గురువారం ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా విధులను కేటాయించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ పోలీస్తో పాటు స్పెషల్ పార్టీ వారు కూడా విధుల్లో ఉండనున్నారు. పోలింగ్ రోజున అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇప్పటివరకు ప్రచారంలో నిబంధనలను ఉల్లఘించిన వారిపై 18 కేసులు నమోదు చేశారు. 53 మంది రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేశారు. పోలింగ్ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలీసుశాఖ ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
ఐదు రూట్లుగా విభజన
పోలింగ్ జరిగే 20 వార్డులను ఐదు రూట్లుగా విభజించారు. ఈ రూట్లలోనే ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం కూడా ఇదే రూట్లలో జూనియర్ కాలేజీలోని రిసెప్షన్ కేంద్రానికి సిబ్బంది చేరుకుంటారు. ఈ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చూసేందుకు ఆరుగురు చొప్పున జోనల్, రూట్ అధికారులను కూడా నియమించారు. వీరితో పాటు రెండు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు, రెండు మోడల్ కోడ్, ఒక్కొక్కటి చొప్పున ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ టీంలు పోలింగ్ రోజున పర్యవేక్షణ చేయనున్నాయి.
మాస్క్ లేకుంటే నో ఎంట్రీ:అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ఓటింగ్కు వచ్చే ప్రతి ఓటరు మాస్క్ వేసుకోవాలని, లేకపోతే ఓటింగ్కు అనుమతించబోమని చెప్పారు. క్యూలైన్లలోనూ భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్లు అందజేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఆరోగ్యసిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బంది గురువారం సాయం త్రానికి తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు.