హాలియా, ఏప్రిల్ 28 : కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల వారు సంయుక్తంగా చర్యలు ప్రారంభించారు. ప్రతి వీధిలో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. కరోనా కట్టడిపై ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా కలిసి వస్తున్నారు. హాలియాలో సాయంత్రం 5 గంటలకే దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకొని దానిని అమలు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి మే 9 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు కానుంది. తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో కూడా వ్యాపారులు మధ్యాహ్నం వరకే తీసి ఉంచి ఆ తరువాత స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేస్తున్నారు.
గ్రామాల్లో శానిటైజేషన్
పెద్దవూర : కరోనా కట్టడికి మండలంలోని పలు గ్రామ పంచాయతీలు చర్యలు ప్రారంభించాయి. మండలంలోని చింతపల్లిలో సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో బుధవారం శానిటైజేషన్ చేయించారు. వీధులు, మురుగు కాల్వల్లో బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిం
కొత్తగూడెంలో..
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని కొత్తగూడంలో సర్పంచ్ మద్దెల సునీత విక్టర్ గ్రామంలోని అన్ని వీధులను శానిటైజేషన్ చేయించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ ప్రసాద్ , ఉపసర్పంచ్ విజయలక్ష్మి, కార్యదర్శి బొల్లేపల్లి సురేశ్ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని మండలంలోని ముదిమాణిక్యం సర్పంచ్ పిల్లి వెంకట్రావమ్మ అన్నారు. బుధవారం గ్రామంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మిర్యాలగూడలో పారిశుధ్య పనులు
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని వివిధ వార్డుల్లో బుధవారం పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతో పాటు శానిటైజ్ చేయిస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు సహకారంతో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.