పేద విద్యార్థులకు ఉన్నత విద్య
గురుకుల, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు
క్రీడలు, ఎన్సీసీ, సమ్మర్ క్యాంపులకు కేరాఫ్
పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందించేలా గురుకుల కళాశాలలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి నందికొండలో మరిన్ని అవకాశాలను కల్పించింది. బీసీ గురుకులంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది. హాస్టల్ వసతిని కల్పించడంతో నిత్యం వేలాది మంది విద్యార్థులతో నందికొండ విద్యానిలయాన్ని తలపిస్తున్నది.
నందికొండ, మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. నాగార్జునసాగర్లో 50సంవత్పరాలుగా జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోరందుకున్నది. నందికొండ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడంతో పాటు భారీగా నిధులు కేటాయించింది. విద్యావ్యవస్థ బలోపేతం దిశగా నూతనంగా పాలిటెక్నిక్, బీసీ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఎన్సీసీ, క్రీడలతో పాటు మానసికోల్లాసానికి విజ్ఞానయాత్రలను ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నది.
నందికొండ మున్సిపాలిటీలో 2016 ఆగస్టు 26న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రధానాచార్యులు, 11మంది అధ్యాపకులు, పీడీ, లైబ్రేరియన్ను నియమించారు. తొలి ఏడాదిలో 114మంది, 2017లో 124మంది, 2018లో 135మంది, 2019లో 148 మంది, 2020లో 156 మంది విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. కొందరు ఐఐటీ, ఎన్ఐటీ, బీడీఎస్, ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యకు ఎంపికయ్యారు.
రూ.7కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల..
నాగార్జునసాగర్లో తెలంగాణ ప్రభుత్వం చొరవ కారణంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాటుకు ముందే మంజూరైనా పనులు నత్తనడకన సాగాయి. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో మూడేండ్లలో పనులు పూర్తయి 2016లో కళాశాల ప్రారంభమైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కళాశాలను ప్రారంభించారు. 2020 విద్యాసంవత్సరానికి సివిల్, ఈఈఈలో మొత్తం 228మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. 197మంది విద్యార్థులు, 31మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని విభాగాలకు సంబంధించి 13ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటికి రెండు బ్యాచ్లు పూర్తయ్యాయి.
రూ.3కోట్లతో హాస్టల్ నిర్మాణం…
కళాశాల ప్రారంభ సమయంలోనే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించారు. పక్కా భవనం నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించారు. డైనింగ్ హాల్, కిచెన్, 25గదులతో రూపొందిన హాస్టల్ భవనం 2019లో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.
క్రీడలు, ఎన్సీసీ, సమ్మర్ క్యాంపులు…
విద్యార్థుల్లో శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంపొందించేలా క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ఎన్సీసీ సహా వేసవి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా కరాటే, మ్యూజిక్, డ్యాన్స్, ఆటల్లో తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకుల కళాశాల విద్యార్థి విజయ్ నేపాల్లో జరిగిన వాలీబాల్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. ఎన్సీసీలో భాగంగా హరితహారం, స్వచ్ఛ భారత్ సహా పలు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుంటున్నారు.