సమరభేరి సభలో ఆడబిడ్డలు
హాలియా, మార్చి 28 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని ఆడబిడ్డలు గొంతెత్తి నినదించారు. ఆదివారం హాలియాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటాం’ అంటూ నియోజకవర్గ మహిళలు సమరభేరి సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నికల హాలియా ఇన్చార్జి కోరుకంటి చందర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ ఏర్పాటు వరకు మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు.
మహిళా అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలను తోబుట్టువులా భావించి నెలనెలా రూ.2016 పింఛన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పేర్ల సుమతి, హాలియా మున్సిపల్ చైర్పర్సస్ వెంపటి పార్వతమ్మ, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యడవల్లి నీలిమామహేందర్రెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఉప ఎన్నికల కోఆర్డినేటర్ మల్గిరెడ్డి లింగారెడ్డి, సంపత్ కుమార్, గంగా భవానీ, సమీన అన్వరుద్దీన్, చాపల పద్మ, వార్డు కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, శ్రీనివాస్, వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్నాయక్, సైదులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ …
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన మహిళలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ మీదుగా లక్ష్మీనర్సింహ గార్డెన్ వరకు 5వేల మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.
నోముల మన మధ్యలోనే ఉన్నారు..
మీ అందరిని ఇక్కడ చూస్తుంటే.. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మన మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తున్నదని ఆయన సతీమణి నోముల లక్ష్మి కంటతడి పెట్టారు. ఉప ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే చందర్, నోముల లక్ష్మి, టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.