నందికొండ, సెప్టెంబర్ 26 : అందమైన నల్లమల అడవులు, చరిత్రకు ఆనవాలుగా నాగార్జునకొండ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రాతికట్టడం నాగార్జునసాగర్ డ్యాం, అంతర్జాతీయంగా బౌద్ధ భిక్షువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మితమౌతున్న శ్రీపర్వతారామం (బుద్ధవనం)… అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ దేశ, విదేశాల పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటూ నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ పై ప్రత్యేక కథనం.
మానవ నిర్మిత ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే రాతి అనకట్టల్లో మొదటిది. 1955 నుంచి 1967 వరకు దాదాపు 12 ఏండ్ల పాటు పూర్తిగా స్వదేశీ ఇంజినీర్ల పరిజ్ఞానంతో, లక్షలాది మంది కూలీల మానవశక్తితో నిర్మించారు. పొడవు 4,758 అడుగులు, ఎత్తు 408 అడుగులు, 300 అడుగుల వెడల్పుతో, 79 బ్లాకులుగా ప్రాజెక్టు నిర్మించారు. గౌతమ బుద్ధుడి జీవితానికి అష్టాంగ మార్గాలను శ్రీ పర్వతారామం(బుద్ధవనం)లో పొందుపరిచారు. మొత్తం 270 ఎకరాల్లో 35 ఎకరాలను ధ్యాన కేంద్రాలకు కేటాయించారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో బయట పడిన బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన ఆనవాళ్లు, రాతి, నవీనయుగాలకు సంబంధించిన శిల్పాలు, మానవులు ఉపయోగించిన పనిముట్లను పురావస్తు శాఖ వారు నాగార్జునకొండలో భద్రపరిచారు. నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో 144 ఎకరాల గుట్టపై 1966 సంవత్సరంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఆహ్లాదం కల్గించేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాగార్జునకొండకు, శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.