గుడిపల్లి ఎస్ఐ వీరబాబు
కరోనా పేషెంట్లకు నిత్యావసరాలు, పోషకాహారం పంపిణీ
పెద్దఅడిశర్లపల్లి, మే 26 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని గుడిపల్లి ఎస్ఐ వీరబాబు కోరారు. మండలంలోని చింతలతండాలో బుధవారం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. బయటికి వెళ్లిన సందర్భాల్లో మాస్క్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీనునాయక్ ఉన్నారు.
హోం ఐసొలేషన్లో ఉండాలి
అడవిదేవులపల్లి : కరోనా పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి ఉపేందర్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి కరోనా పేషెంట్లకు సలహాలు అందించారు. పీహెచ్సీలో 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ రాగా మెడికల్ కిట్లు అందించినట్లు తెలిపారు.
పేషెంట్లకు నిత్యావసర సరుకులు
తిరుమలగిరి సాగర్ : మండలంలోని రంగుండ్ల గ్రామ ఉద్యోగులు, వ్యాపారుల ఆర్థిక సాయంతో కరోనా పేషెంట్లకు బుధవారం 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను యూత్ సభ్యులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శివకృష్ణ, దుశ్యంత్, బాబురావు పాల్గొన్నారు.
కమలా నెహ్రూ దవాఖానలో..
నందికొండ : కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు 1992 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం సీఐ గౌరునాయుడు చేతుల మీదుగా పౌష్టికాహారం అందించారు. సేవ్ అవర్ సాగర్ కరోనా వారియర్స్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు, సరిహద్దు చెక్పోస్టులో విధులు నిర్వహించే పోలీసులకు మధ్యాహ్న భోజనం అందించారు. కార్యక్రమంలో దవాఖాన సీఎంఓ భానుప్రసాద్, డాక్టర్ చక్రవర్తి, ఎస్ఐ నర్సింహారావు, పూర్వ విద్యార్థులు తాజుద్దీన్, ప్రకాశ్ పాల్గొన్నారు.
కరోనా వారియర్స్కు శానిటైజర్లు
హాలియా : యువత సేవాభావాన్ని కలిగి ఉండాలని హాలియా ఎస్ఐ శివకుమార్ అన్నారు. పట్టణంలోని శివ జిమ్ సెంటర్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
పీపీఈ కిట్ల అందజేత
మిర్యాలగూడ టౌన్, మే 26 : కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న పట్టణానికి చెందిన గయాజ్ మిత్ర బృందాన్ని వన్టౌన్ సీఐ సదా నాగరాజు అభినందించారు. గయాజ్తో బృందానికి ఖలీల్దాబా హోటల్ నిర్వాహకులు ముర్తుజా, గౌస్అలీ అందించిన పీపీఈ కిట్లను బుధవారం ఆయన పంపినీ చేశారు. కార్యక్రమంలో ఫసీ, ఫయాజ్, ఫారూక్ పాల్గొన్నారు.
పేదలకు నిత్యావసర సరుకులు
మిర్యాలగూడ రూరల్ : సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన 27 పేద కుటుంబాలకు బుధవారం నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో సేవా సమితి మిర్యాలగూడ కన్వీనర్ చిల్లంచర్ల ఆదినారాయణ, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, ఐఏఎం శ్రీధర్, గుప్త, రఘు, బాలు పాల్గొన్నారు.