అటవీ భూముల్లో వైకుంఠ ధామం
వైకుంఠధామం నిర్మాణానికి గ్రామ శివారులో గతంలో శ్మశానవాటికకు ఉపయోగించిన స్థలం కేటాయించారు. అనంతరం నిర్మాణం మొదలు పెట్టారు. పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఆ స్థలం అటవీ శాఖకు సంబంధించిందని ఆ శాఖ అధికారులు పనులను అడ్డుకున్నారు. దీంతో మూడు నెలలుగా పనులు సాగడం లేదు. సర్పంచ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించ లేదు.
ప్రారంభం కాని డంపింగ్ యార్డు పనులు
గ్రామ శివారులో డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. పనులు ప్రారంభించేందుకు చెట్లు, రాళ్లు తొలగించి స్థలాన్ని చదును చేశారు. డంపింగ్ యార్డు బోర్డు కూడా పెట్టారు. కానీ నిర్మాణ పనులకు చొరవ తీసుకోలేదు. దీంతో అక్కడ పాతిన బోర్డును కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. డంపింగ్ యార్డు పనులు మొదలు పెట్టడానికి ఆటంకాలేమిటో అర్థం కాని పరిస్థితి.
పల్లె పకృతి వనంపై అశ్రద్ధ
గ్రామంలో పల్లె పకృతి వనం ఏర్పాటుకు ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రాంగణంలో స్థలం కేటాయించారు. దానికి కావాల్సిన పనులు చేపట్టి మొక్కలు నాటారు. ఆరోగ్యవంతంగా పెరగడానికి చర్యలు తీసుకోకపోవడం, నీరు పెట్టకపోవడంతో ఎండకాలంలో మొక్కలు ఎండి పోయాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన పల్లె పకృతివనం వాడిపోయింది.
నర్సరీలో కానరాని మొక్కలు
హరితహారంలో మొక్కలు నాటడానికి గ్రామంలో మొక్కలు పెంచి అందివ్వడానికి ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చేసింది. కానీ అవంతీపురంలో కవర్లలో మట్టి నింపి అందులో విత్తనాలు నాటారు. కానీ అవి మొలకెత్తి పెరిగేందుకు శ్రద్ధ తీసుకోలేదు. దీంతో మొక్కలు ఎండిపోయి బోసిగా కనిపిస్తున్నది. ఇక గ్రామంలో మురుగుకాల్వలు అధ్వానంగా ఉన్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో దుర్వాసనతోపాటు దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి.
చివరి కష్టాలు తీరేదెప్పుడో..
గతంలో ఎవరైనా మృతి చెందితే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో ఆర్థమయ్యేది కాదు. ప్రభుత్వం స్థలం కేటాయించి వైకుంఠధామం పనులు చేపట్టడంతో సమస్య శ్వాతంగా తీరుతుందని సంతోషపడ్డాం. కానీ పని మధ్యలోనే అగి పోవడంతో మళ్లీ మొదటి కొచ్చింది.
– గాదరి సైదులు, గ్రామస్తుడు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
అవంతీపురం పల్లె ప్రతి పనులకు ఆటంకాలు ఏర్పడిన విషయం మా దృష్టికి వచ్చింది. వైకుంఠధామం స్థలం అటవీశాఖ అధికారులు తమదంటున్నారు. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. స్థలాన్ని పరిశీలించారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. పల్లె పకృతి వనం, నర్సరీలను సరిగ్గా చూసుకునేవిధంగా చర్యలు తీసుకుంటాం.
వన సంరక్షకుడి వల్లే మొక్కలు ఎండిపోయాయి
అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడం వల్ల వైకుంఠధామం, రైతు అభ్యంతరం చెప్పడం వల్ల డంపింగ్ యార్డు పనులు నిలిచిపోయాయి. పల్లె పకృతి వనం సంరక్షకుడి నిర్లక్ష్యం వల్ల వాడిపోయింది. కొత్తగా వన సంరక్షకుడిని ఏర్పాటు చేసినం. నర్సరీలో తొలుత నాటిన గింజలు మొలవలేదు. రెండోసారి గింజలు నాటాం. ఇక నుంచి నిబద్ధ తతో అభివృద్ధి చేస్తాం
-దుగ్యాల వెంకన్న, సర్పంచ్, అవంతీపురం