రామగిరి, జూన్ 24 : నూతన విద్యాసంవత్సరం జూలై 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందుగా 8, 9, 10తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆసక్తి మేరకు ఆఫ్లైన్, ఆన్లైన్లో బోధన కొనసాగనున్నది. ఇక మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా 835మంది టీకా వేసుకున్నారు.ప్రభుత్వ, ఎయిడెడ్, జడ్పీ, మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఈ నెల 25న విధులకు హాజరుకానున్నారు. జూలై 1నుంచి 8, 9, 10 తరగతులకు బోధన కొనసాగనుండగా పరిస్థితులకు అనుగుణంగా అన్ని తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
వారం రోజులు సంసిద్ధతా కార్యక్రమాలు..
తరగతుల ప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయులు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే అవకాశాలతో పాటు కొత్త, పాత అడ్మిషన్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్న భోజన వంట పాత్రలతో పాటు బియ్యం తనిఖీ చేసి నాణ్యతను చెక్ చేస్తారు. పాఠ్యపుస్తకాల నిల్వలు, సిబ్బంది వ్యాక్సినేషన్ సమాచారాన్ని రోజువారీగా ఉన్నతాధికారులకు అందించాలి. మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రం చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్,ఆఫ్లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తు చేయాల్సి ఉంటుంది.
తొలిరోజు 835మందికి వ్యాక్సిన్…
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ గురువారం మొదలైంది. నల్లగొండ జిల్లాలో 380 మంది, సూర్యాపేట జిల్లాలో 455 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని డీఈఓ భిక్షపతి వెల్లడించారు.