హాలియా, మే 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత పర్మిషన్ ఉన్న వాహనాలు మినహా ఇతర వాటిని అనుమతించడం లేదు. అనవసరంగా బయటికి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం అనుమతి లేకుండా రోడ్డుపై తిరుగుతున్న 11 బైక్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ను పక్కాగా పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. లాక్డౌన్ అమలుతో వాహనాలు, జనసంచారం లేక హాలియా ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.
50 బైక్లు సీజ్..
నిడమనూరు : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండలంలో పక్కాగా పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. ఆ తరువాత దుకాణాలు తెరిచినా, అనవసరంగా రోడ్లపైకి వచ్చినా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. శని, ఆదివారాల్లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన 50 వాహనాలను సీజ్ చేసినట్లు, 60 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొండల్రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచే దుకాణాదారులపై కేసులు నమోదు చేస్తున్నామని, ఇలాంటివి మండలంలో 100 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
భౌతిక దూరం పాటించాలి : సీఐ
నందికొండ : ప్రజలు నిత్యావసరాల కోసం బయటికి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలని నాగార్జునసాగర్ సీఐ గౌరీనాయుడు సూచించారు. ఆదివారం పైలాన్కాలనీలోని సంతలో భౌతిక దూరం పాటించకుండా కొనుగోళ్లు చేపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని, అనవసరంగా బయట తిరిగే వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ నర్సింహారావు ఉన్నారు.
నిబంధనలు పాటించాలి
గుర్రంపోడు : మండల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పక్కాగా పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ఎస్ఐ రవికుమార్ కోరారు. ఆదివారం పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, అనవసరంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల తర్వాత జనసంచారం లేక ప్రధాన రహదారితో పాటు, గ్రామీణ రోడ్లు కూడా బోసిపోయాయి.
వాహనాల తనిఖీ
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని అంగడిపేట స్టేజీవద్ద వాహనాల తనిఖీ, లాక్డౌన్ అమలును కొండమల్లేపల్లి సీఐ పి. పరశురామ్ పరిశీలించారు. 10 గంటల తరువాత జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనదారులను ఆపి ప్రశ్నించారు. అనుమతి లేకుండా ప్రయాణిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట గుడిపల్లి ఎస్ఐ వీరబాబు ఉన్నారు.
అడవిదేవులపల్లిలో పకడ్బందీగా..
అడవిదేవులపల్లి : లాక్డౌన్ను మండలంలో పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్ఐ వీరశేఖర్ పలు గ్రామాల్లో వాహనాలను తనిఖీ చేశారు. అకారణంగా బయటకు వచ్చిన వాహన దారులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు బయటికి రావద్దని సూచించారు. జనసంచారం లేక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
రహదారులు నిర్మానుష్యం
వేములపల్లి : మండలంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో వీధులు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నార్కట్పల్లి-అద్దంకి రహదారి, భీమారం-సూర్యాపేట రోడ్లు వాహనాలు లేక బోసి పోయాయి. లాక్డౌన్ కారణంగా మండలంలో కొవిడ్ కేసులు కొంత మేర తగ్గాయని వైద్యాధికారులు తెలిపారు.