నల్లగొండ ప్రతినిధి, జూన్23(నమస్తే తెలంగాణ) : వచ్చే నెల1వ తేదీ నుంచి మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతోపాటు తాగునీటి సరఫరా, వీధిలైట్లు, మొక్కల పెంపకం లాంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నిధులతోనే ఇప్పటికే ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్, ట్యాంకర్ను సైతం కొనుగోలు చేశారు. ట్రాక్టర్తో చెత్త సేకరిస్తున్నారు. ట్యాంకర్తో గ్రామ పరిధిలోని హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పెడుతూ కాపాడుతున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామానికీ వీటిని ప్రభుత్వం సమకూర్చింది. ప్రతి నెలా కేంద్ర 15వ ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.18కోట్లు విడుదలవుతున్నాయి. వీటిని జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నారు. గ్రామంలోని ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా రూ.136 చొప్పున ఏడాదికి రూ.1632 వెచ్చిస్తున్నారు.
స్థానిక సంస్థల బలోపేతం..
2019లో సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల నియామాకంతోపాటు గ్రామానికి ఒక కార్యదర్శి ఉండేలా చర్యలు చేపట్టారు. వీరితో పాటు ప్రతి పంచాయతీలో సిబ్బందిని పెంచుతూ అవసరాన్ని బట్టి మల్టీ పర్సస్ వర్కర్స్ను కొత్తగా తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ నుంచి పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. 2019 సెప్టెంబర్ 6నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి విడుతలో నెల రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుంచే నిధుల విడుదల కూడా మొదలైంది. రెండో విడుత పల్లె ప్రగతిని 2020 జనవరి రెండు నుంచి 11వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహించారు. ఇదే సమయంలో పట్టణ ప్రగతిపైనా కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే ఫిబ్రవరిలో నూతన పాలకవర్గాల నేతృత్వంలో దీనికి శ్రీకారం చుట్టారు. 2020 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వరకు పట్టణ ప్రగతిని చేపడుతూ పారిశుధ్యంతోపాటు వార్డుల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత కరోనా పరిస్థితులతో గతేడాది జూన్ 1 నుంచి 8వరకు పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఓ వైపు పల్లెల్లో, మరోవైపు పట్టణాల్లో ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతుండడంతో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
మూడో విడుతకు ఏర్పాట్లు
మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 1 నుంచి 10 రోజులపాటు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత విభాగాలతో అధికారులు ఇప్పటికే సమీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని కూడా చర్చించనున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోని చెత్త సేకరణ, నిర్వహణ కోసం ప్రత్యేకంగా డంపింగ్ యార్డులు నిర్మించారు. ఎవరైనా చనిపోతే చివరి మజిలీకి ఉన్న కష్టాలను గుర్తించి ప్రత్యేకంగా వైకుంఠధామాలను నిర్మించారు. దాదాపు 95శాతం వరకు ఇవి పూర్తయ్యాయి. వీటిని సమీక్షిస్తూ అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించనున్నారు.
మురుగుకాల్వలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల నివారణ, తాగునీటి వ్యవస్థ, రోజువారీ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయనున్నారు. ఇదే సమయంలో ఒక్క గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే రహదారుల వెంట మొక్కలను నాటనున్నారు. ఇప్పటికే ఆరు విడుతల హారితహారాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈసారి హరితహారంలో భాగంగా మొత్తం 1.26కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా గ్రామాల్లో 86లక్షలు, పట్టణాల్లో 10లక్షలు, అటవీశాఖ ద్వారా మరో 30లక్షల మొక్కలను అందుబాటులో ఉంచారు. గతేడాది 1.02కోట్ల మొక్కలను లక్ష్యంగా పెట్టుకోగా 93లక్షలు నాటారు. ప్రతి గ్రామపంచాయతీకో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా నర్సరీలను అందుబాటులోకి తెచ్చారు. మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. దీనిపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.