రామగిరి/నీలగిరి, జూన్ 23 : ప్రజాసేవలో కమ్యూనిస్టులు ముందుండడం అభినందనీయమని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ ఫౌండేషన్ వారు అందించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి బుధవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్డి ల్యాబ్ ప్లాంట్ ఇన్చార్జి కృష్ణారావు, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను ఎస్పీ రంగనాథ్కు క్యాంపు కార్యాలయంలో అందించారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో రోగులకు సీపీఎం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రారంభించారు.
కలెక్టర్కు కొవిడ్ కిట్ల అందజేత
నల్లగొండ : క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నామ్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ మాడ్గుల పల్లి వారు కలెక్టరేట్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు కొవిడ్ కిట్లు అందించారు. రూ.2 లక్షల విలువైన 300లీటర్ల శానిటైజర్, 240 పీపీఈ కిట్లు, 2500 మాస్కులు, 38 బాక్సుల గ్లౌజులు, 370 ఫేస్ షీల్డ్లను అందించారు. కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, సంస్థ ప్రతినిధులు వెంకట్రామ్రెడ్డి, ప్రసాద్, ముఖేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇప్పలగూడెంలో పారిశుధ్య పనులు..
కేతేపల్లి : మండలంలోని ఇప్పలగూడెంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా వీధుల వెంట మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య పనులు చేపట్టారు. టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు వంటల చేతన్కుమార్ ఆధ్వర్యంలో మురుగు కాల్వల్లో దోమలు, క్రిమికీటకాలను చంపేందుకు రసాయన మందులను పిచికారీ చేశారు.