ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 390 పడకలు
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఒక్కరోజే నల్లగొండ జిల్లాలో 285, సూర్యాపేటలో 130, యాదాద్రిలో 140 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది. వారం రోజులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. దీంతో జిల్లా అధికార యం త్రాంగం, వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో పరిస్థితులపై మంగళవారం సూర్యాపేటలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి కూడా సమీక్షంచారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా వచ్చిన వారిలో 90శాతం మంది హోం ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని, కేవలం 10 శాతం మందికి మాత్రమే దవాఖానకు వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వైద్యసేవలను మరింత సమర్ధవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అందుబాటులో కొవిడ్ బెడ్స్
నల్లగొండ జిల్లాలోని ఐదు ప్రధాన దవాఖానల్లో కొవిడ్ బెడ్లను అందుబాటులో ఉంచారు. జిల్లా కేంద్ర దవాఖానలో మొత్తం 180 బెడ్లను ప్రత్యేకంగా కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా నియమించారు. ఇక్కడ ప్రస్తుతం 100 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 80పడకలు ఖాళీగానే ఉన్నాయి. మిర్యాలగూడ ఏరియా దవాఖానలో 50 పడకలు ఉండగా ప్రస్తుతం 40 ఖాళీగా ఉన్నాయి. నాగార్జునసాగర్ కమలానెహ్రూ దవాఖానలో 100 పడకలు ఉండగా 20 మంది మాత్రమే చికిత్స పొందుతుండగా మిగతావి ఖాళీగానే ఉన్నాయి. దేవరకొండలో 50 పడకలకు గానూ 40 అందుబాటులో ఉన్నాయి. నకిరేకల్లో 10 బెడ్లు ఉండగా 8 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 180 ఆక్సిజన్ బెడ్లు ఉంటే 100 మాత్రమే రోగులతో నిండి ఉండగా మరో 80 ఖాళీగా ఉన్నాయి. 40 ఐసీయూ పడకలకు గానూ 30ఖాళీగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ ఏరియా దవాఖానలో 20 పడకలకు 19ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట ఏరియా దవాఖానలో 240 కొవిడ్ బెడ్స్ ఉండగా 60 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 180 పడకలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట మండలంలోని కేసారంలోని కొవిడ్ కేర్ సెంటర్లో 100 పడకలు ఉంటే ఇద్దరు మాత్రమే చికిత్స పొందుతున్నారు.
101 కేంద్రాల్లో పరీక్షలు…
కొవిడ్ నిర్ధారణ కేంద్రాలు ఉమ్మడి జిల్లాలోని జిల్లా కేంద్ర దవాఖాన నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయిలోని అన్ని పీహెచ్సీల్లోనూ కొనసాగుతున్నాయి. నల్లగొండలోని జిల్లా కేంద్ర దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తుండగా సూర్యాపేట దవాఖానలో లాబ్నాట్ ద్వారా పరీక్షల ఫలితాలు అక్కడికక్కడే వెల్లడిస్తున్నారు. వీటికి తోడు అన్ని అర్బన్, ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ పరీక్షలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన కిట్స్ను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 44 కేంద్రాల్లో, సూర్యాపేటలో 31 కేంద్రాల్లో, యాదాద్రిలో 26 కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రైవేటు దవాఖానలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
97 చోట్ల వాక్సినేషన్
జనవరి నుంచి కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రస్తుతం పీహెచ్సీల స్థాయి వరకు అందుబాటులోకి తెచ్చారు. నల్లగొండలో 43 కేంద్రాల్లో, సూర్యాపేటలో 31, యాదాద్రిలో 23 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. మరికొన్ని ప్రైవేటు దవాఖానల్లోనూ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాక్సినేషన్కు ప్రారంభంలో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోయినప్పటికీ నెల రోజులుగా కేసులు పెరుగుతుండడంతో ఇప్పుడు పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి టీకా తీసుకుంటున్నారు. ప్రారంభంలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు, తర్వాత వృద్ధులకు, ప్రస్తుతం 45సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మే నుంచి 18ఏండ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.