రామగిరి, జూలై 20 : త్యాగానికి ప్రతీక బక్రీద్. బుధవారం పవిత్ర దినం జరుపుకొనేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పండుగలో ప్రధానంగా ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. దీని కోసం పొట్టేలు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మంగళవారం మార్కెట్లన్నీ సందడిగా మారాయి.
పెరిగిన ధరలు
గతేడాది కంటే ఈ సంవత్సరం పొటేళ్లు, గొర్రెలు, మేకల ధరలు పెరిగాయి. గతంలో పది కేజీలు ఉండే పొట్టేలు ధర రూ.5వేలు ఉండగా ఇప్పుడు రూ.6నుంచి 7వేలు పలికింది. పెద్ద వాటికి రూ.12 వేల నుంచి రూ.20వేల వరకు అమ్ముతున్నారు.
మూడు భాగాలుగా ఖుర్బానీ
బక్రీద్ రోజున అల్లాహ్ పేర బలిచ్చిన జంతు మాంసాన్ని మూడు భాగాలుగా చేస్తారు. ఒక భాగం ఖుర్బానీ ఇస్తున్నవారు తీసుకుని, రెండో భాగాన్ని తమ బంధువులకు, మూడో భాగాన్ని పేద ముస్లింలకు దానం చేస్తారు.
పెద్ద ఎత్తున ఏర్పాట్లు
గతేడాది కొవిడ్ కేసుల కారణంగా బక్రీద్ను నామమాత్రంగా జరుపుకున్నారు. ఈ సారి లాక్డౌన్ ఎత్తివేయడంతోపాటు కరోనా తీవ్రత తగ్గడంతో ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజుల ముందు నుంచే గొర్రెలు, మేకలతోపాటు కొత్తబట్టలు, పండుగ సామగ్రి కొనుగోలు చేశారు. మరోవైపు ప్రార్థనా స్థలాలను సిద్ధం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి..
నల్లగొండ, సూర్యాపేట పట్టణాల సమీపంలోని గ్రామాలతోపాటు దేవరకొండ, చందంపేట, మిర్యాలగూడ, మునుగోడు, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, ఆంధ్ర ప్రాంతాల నుంచి జిల్లాకు పొట్టేళ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గుత్తా సుఖేందర్రెడ్డి
ముస్లింలకు శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, షాదీముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఉర్దూను మొదటి లాంగ్వేజ్ ఆప్షన్గా గుర్తింపు, ఉర్దూలో డీఎస్పీ వంటివి చేపట్టిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలతో బక్రీద్ను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. అలాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
ముందే కొన్నాం..
బక్రీద్ వస్తుందంటేనే పొట్టేళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. అందుకే పండుగ కోసం ముందస్తుగానే కొనుగోలు చేసి తెచ్చాం. గతేడాది కంటే ఈసారి కొద్దిగా రేట్లు పెరిగినయి. ఖుర్బానీ కోసం ధర ఎంతైనా పెడుతాం. ఇప్పుడు కొవిడ్ తీవ్రత తక్కువగా ఉండడంతో ఖుర్బానీ ఎక్కువ పంచుతాం.