నీలగిరి, మే 20 : ‘కరోనా వచ్చి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇది అందరికీ రాదు. వచ్చి స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారికి, షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేని వారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ వస్తుంది. అదేవిధంగా తీవ్రమైన తలనొప్పి, పన్ను నొప్పి, కంటిచూపు మందగించడం, ముక్కు ద్వారా రక్తంతో కూడిన ద్రవాలు రావడం, నోటి దుర్వాసన వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలు. ముందుగా గమనించి డాక్టర్ను సంప్రదిస్తే ప్రమాదం ఉండదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది.’ అని ప్రముఖ ఛాతి వైద్య నిపుణుడు డాక్టర్ చిలుకరాజు రాకేశ్ తెలిపారు. కరోనా బాధితులు ఎక్కువగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, రోజుకు రెండు, మూడు సార్లు నోటిని పుక్కిలించడం, మాస్కులు ధరిస్తూ కరోనాను కట్టడి చేయాలన్నారు. కరోనా వచ్చిన తరువాత నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉందని, వైద్యులు సూచించిన మందులను మాత్రమే వాడాలని సూచించారు. సాధారణ వ్యక్తులు, బాధితుల్లో ఆయాసం, దగ్గు, నీరసం లాంటి సమస్యలు వస్తుంటే రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలని సూచించారు.
ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఆయాసం వస్తుంది- చంద్రయ్య, నకిరేకల్
డాక్టర్ : కిడ్నీల్లో రాళ్లు ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. జ్వరం, కరోనా లక్షణాలు లేవు.. కనుక డాక్టర్ను సంప్రదించి మందులు వాడండి.
ప్రశ్న : గతంలో నాకు ఆస్తమా ఉంది. కరోనా వల్ల ఇబ్బంది పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి- చిట్యాల నర్సయ్య, నిజామాబాద్
డాక్టర్ : ఆస్తమా ఉన్నవారికి కరోనా పాజిటివ్ వస్తే కొంత ప్రమాదకరంగా ఉంటుంది. ఆస్తమా ఉన్న వారు అవసరం ఉంటేనే బయటకు రావాలి. మాస్కులు వాడుతూ, భౌతిక దూరం పాటించాలి. దుమ్ము, ధూళి ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. చల్లని, పుల్లటి పదార్థాలు తినడం మానేయాలి. ఆవిరి పట్టడం వంటివి చేయాలి. ఆస్తమాకు సంబంధించిన మందులు వాడుతూనే కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రశ్న : నాకు బైపాస్ సర్జరీ అయింది. సర్వైకల్ సమస్య ఉంది. ఉదయం వేళల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది -కట్టూరి అప్పారావు, చిలుకూరు. సూర్యాపేట జిల్లా
డాక్టర్ : భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా వాడుతున్న మందులను వాడాలి. కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. శ్వాసకు సంబంధించి దగ్గరలోని ఛాతి వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడండి.
ప్రశ్న : నాలుగైదు రోజులుగా దగ్గు, ఆయాసం వస్తుంది. నీరసం కూడా ఉంది. కరోనా పరీక్ష చేస్తే లేదన్నారు. – ఆనంద్కుమార్, దేవరకొండ
డాక్టర్ : ర్యాపిడ్ కిట్తో కాకుండా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోండి. పాజిటివ్ వస్తే మందులు వాడండి. నెగెటివ్ వస్తే రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పరీక్షించుకోవాలి. 94 ఉంటే ఆరు నిమిషాలు నడిచి ఆక్సిజన్ లెవల్స్ మళ్లీ చూసుకోవాలి. ఐదు శాతంకన్నా తక్కువగా వస్తే సీటీ స్కాన్ చేయించి డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది.
ప్రశ్న : శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది- కేతావత్ జగన్, రేకులగడ్డ, దేవరకొండ
డాక్టర్ : వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అవరసమైతే ఎక్స్రే తీసుకోవడం మంచిది. వీలైతే సీటీ స్కాన్ చేయించుకోవాలి. ప్రస్తుత సమయంలో శ్వాసకు సంబంధించిన లక్షణాలు వస్తే కరోనాగా భావించవచ్చు. పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. మైల్డ్ ఆస్తమా, ఎలర్జీ కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.
ప్రశ్న : మార్చి 24న కొవాగ్జిన్ టీకా మొదటి డోసు వేసుకున్న. మే 1న కరోనా పాజిటివ్ వచ్చింది. రెండో డోసు తీసుకోవచ్చా?-ఎస్.వెంకయ్య, సూర్యాపేట
డాక్టర్ : ప్రస్తుతం మీకు ఎలాంటి సమస్యలూ లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 20 రోజులుగా హోం ఐసొలేషన్లో ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు లేనందున ఆరోగ్యంగానే ఉన్నట్లు. మీరు పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వస్తుంది. మరో నెల రోజులపాటు నీరసంగా ఉంటుంది. కాబట్టి మీరు పౌష్టికాహారం తీసుకోవాలి. టీకా కోసం ప్రభుత్వం సూచించిన విధంగా 6నుంచి 8 వారాలు కచ్చితంగా ఆగాలి.
ప్రశ్న : వారం రోజులుగా ఆయాసం, ఒంటి నొప్పులతో లో జ్వరం వస్తుంది. పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది.- దామెర ఉత్తరయ్య. దామెర, నాంపల్లి
డాక్టర్ : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయి. వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. అది కూడా నెగెటివ్ వస్తే సిటి స్కాన్ చేయించుకోండి. శ్వాస తీసుకునేందుకు ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది. డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే సరిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ప్రశ్న : మూడ్రోజులుగా ఆయాసం వస్తుంది. లో జ్వరం వస్తూపోతుంది. ఒంటి నొప్పులు బాగా ఉన్నాయి. -సందీప్నాయక్, గారకుంటతండా, గరిడేపల్లి
డాక్టర్ : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయి. వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్, నెగెటివ్ రిపోర్టు ఏది వచ్చినా సీటీ స్కాన్ చేయించుకుంటే ఆయాసానికి గల కారణం తెలుస్తుంది. కరోనా రిపోర్టు వచ్చేవరకు డోలో మాత్రలు వాడండి. సొంత వైద్యాన్ని మాని డాక్టర్ను సంప్రదించండి.
ప్రశ్న : నా భార్యకు పాజిటివ్ వచ్చి 10 రోజులు అవుతుంది. నడిచినప్పుడు ఆయాసం వస్తుంది – కె.ఉపేందర్, కొమరబండ, కోదాడ
డాక్టర్ : వెంటనే ఆక్సిజన్ లెవల్స్ సరిచూసుకోవాలి. ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. హెచ్ఆర్సీటీ స్కానింగ్ చేయించండి. వైద్యుల సలహాలు తీసుకుని మందులు వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రశ్న : వారం రోజులుగా చాతి నొప్పి వస్తుంది. ఎడమ చేతి బాగా లాగుతుంది.- బొక్కా జ్యోతి, హయత్నగర్, హైదరాబాద్
డాక్టర్ : ఛాతి నొప్పి మూడు, నాలుగు రకాలుగా వస్తుంది. గుండెనొప్పి, కండరాలు పట్టేయడం, గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా వస్తుంది. కరోనాతో సంబంధం లేదు. ఆయాసం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటేనే కరోనా బారిన పడ్డట్టు. మీరు వెంటనే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించండి.