నల్లగొండ ప్రతినిధి,(నమస్తే తెలంగాణ)/సూర్యాపేటసిటీ, మే 17 : కొవిడ్తోపాటు లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా తిరుగుతున్న వారిని దారిలో పెట్టేందుకు పోలీసులు కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. లాక్డౌన్ మొదలైన ఈ నెల 12 నుంచి మంగళవారం వరకు ప్రధాన కూడళ్లతోపాటు మండల కేంద్రాల్లోనూ పోలీసుల బందోబస్తు కొనసాగుతున్నది. బారికేడ్లను ఏర్పాటు చేసి రోడ్లపైకి వస్తున్న వాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. అనుమతి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు చెందిన వారైతే గుర్తింపుకార్డు చూపితే వదిలేస్తున్నారు. అదేవిధంగా ముందస్తుగా ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ-పాసులు ఉన్న వారిని సైతం పట్టించుకోవడం లేదు. దీంతోపాటు అత్యవసర వైద్యసేవల కోసం, మందుల కోసం వెళ్లే వారిని తగిన ఆధారాలు చూపితే అనుమతిస్తున్నారు. వీరుకాకుండా ఎలాంటి అనుమతి గానీ, అత్యవసర పరిస్థితి గానీ లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. వివిధ రకాల కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా తెరిచి ఉండే వ్యాపార సంస్థల పట్ల కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గల్లీ దుకాణాలను సైతం వదలకుండా కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తే పొటోలు తీసి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
నల్లగొండలో 4,292 కేసులు
లాక్డౌన్ మొదలైన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా 4,292 కేసులు నమోదు చేశారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అకారణంగా బయట తిరుగుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే పట్టణాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. లాక్డౌన్ సమయంలో తెరిచి ఉంచిన వైన్స్లు, వివిధ రకాల దుకాణాలు, షాపింగ్మాల్స్ లాంటి వాటిపై మొత్తం 495 కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా నిబంధనల ఉల్లంఘనల కేసుల పేరుతో మరో 40 నమోదు చేశారు. ఈ-పిటీ కేసులు 1316, అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై 2156 ఈ చలాన్ల జరిమానాలు విధించారు. ఇక అనుమతి లేకుండా అకారణంగా రోడ్లపై తిరుగుతున్న 285 వాహనాలను సీజ్ చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో మాస్క్ ధరించకపోవడంపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్పీ రంగనాథ్, ఏఎస్పీ నర్మద స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నారు.
సూర్యాపేటలో 4,495 కేసులు
సూర్యాపేట జిల్లాలోనూ పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో 4,495 కేసులు నమోదు చేశారు. ఇదే విషయాన్ని ఎస్పీ భాస్కరన్ ధ్రువీకరించారు. అనుమతి లేకుండా బయట తిరిగితే పోలీసులు ఆపి జరిమానా విధిస్తున్నారు. వాహనం ఆపకపోతే ఫొటోలు తీసి ఈ-చలాన్ల ద్వారా జరిమానాలు వేస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నారు. సందుగొందుల్లో జమయ్యే ఆకతాయిలను సైతం గుర్తించి స్పెషల్ ఫోర్స్తో వారి ఆట కట్టిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తూ.. అదే పనిగా రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే వాహనం సైతం సీజ్ చేస్తున్నారు. వారం రోజులుగా నమోదైన కేసుల్లో తొలిరోజు 650, 2వ రోజు 810, 3వ రోజు 820, 4వ రోజు 680, 5వ రోజు ఆదివారం 737 కేసులు నమోదు చేశారు. 6వ రోజు అత్యధికంగా 798 ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు.
చలాన్లు విధించే అంశాలివే
మాస్క్ సరిగ్గా ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, గుంపులు గుంపులుగా చేరితే నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. ఇక లాక్డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి అనుమతి లేకుండా రోడ్లపైకి రావడం, దుకాణాలు తెరిచి ఉంచడం, ముందస్తు అనుమతి లేకుండా వాహనాలతో రోడ్లపైకి రావడం లాంటి వారిపై కేసులు, జరిమానాలు వేస్తున్నారు. వీటితోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ధూమపానం చేయడం లాంటి వాటిపైనా కేసులు కొనసాగిస్తున్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్
ఉమ్మడి జిల్లాలో లాక్డౌన్ వరుసగా ఏడోరోజు సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం10గంటల తర్వాత ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేదు. అక్కడకక్కడ యువతతో పాటు మరికొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వస్తే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ-హైదరాబాద్, నార్కట్పల్లి-అద్దంకి రహదారులపై మాత్రం సరుకు రవాణా, అత్యవసర వాహనాలు యథావిధిగా తిరిగాయి. వైద్య అవసరాలు, కొవిడ్ చికిత్సలకు సంబంధించిన వాహనాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఇక అనుమతి మేరకు వివిధ రంగాల్లోనూ పనులు జరుగుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా ఉదయం 6 నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో కొందరు ఏ చిన్న పని ఉన్నా బయటకు వస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. అలా కాకుండా కొందరు విచ్చలవిడిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే లాక్డౌన్ ఉల్లంఘనులపై నిత్యం కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నాం. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను అందరూ సక్రమంగా పాటించాలి. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో కొవిడ్ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా సామాజిక బాధ్యతతో లాక్డౌన్కు సంపూర్ణంగా సహకరించాలి. ఎవరికీ వారే స్వచ్ఛందంగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి తమ వంతు పాత్ర పోషించాలి.
-ఏవీ రంగనాథ్, డీఐజీ, నల్లగొండ
అకారణంగా రోడ్లపైకి రావద్దు
అకారణంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇంటి వద్దనే ఉండి పోలీసులకు సహకరించాలి. మా సిబ్బంది తమ కుటుంబాలను వదిలి ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లపై ప్రజల కోసమే పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. బయటకు వచ్చి కేసుల పాలు కావద్దు.
-ఆర్.భాస్కరన్, ఎస్పీ, సూర్యాపేట