నల్లగొండ ప్రతినిధి, మే 17 (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగం తన వంతు పాత్రకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే కరోనా బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం, వైద్యాధికారులు, వివిధ రంగాల నిపుణులు ఎప్పటికప్పుడూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా సరే తొలి దశలో పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. కొన్ని గ్రామాల్లో 40 నుంచి 50 కేసుల వరకు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. కరోనాను తొలి దశలోనే గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. అయితే.. ఆయా మండలాల్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలో పోలీసు సిబ్బందికి గ్రామాల వారీగా బాధ్యతలను అప్పజెప్పనున్నారు.
ఆ తర్వాత ఆయా గ్రామాల్లోని సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్లు ఇలా వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయనున్నారు. వీరితో ప్రత్యేకంగా జూమ్ ద్వారా గానీ లేదంటే ఇతర మార్గాల్లో సంప్రదింపులు జరిపి సన్నద్ధం చేయనున్నారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లో యాక్టివ్గా ఉన్న యువజన సంఘాలను లేదంటే యువతను, వివిధ గ్రామ అభివృద్ధి సొసైటీలను గుర్తించి వారిని కూడా ఇందులో కలిసొచ్చేలా చూడనున్నారు. వీరిందరితో కలిపి ఆయా గ్రామాల్లోని కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించనున్నారు. అందరితో కలిపి గ్రామంలోనే ఓ హెల్ప్లైన్ సెంటర్ను గానీ నేరుగా 100 డయల్కు కాల్ చేయడం ద్వారా గానీ గ్రామంలోని కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులను మూడు దశలుగా విభజించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యం, ఆహారం, తదితర సమస్యలపై ప్రజలను అప్రమత్తం చేస్తారు.
తొలి దశలో జ్వరం, ఒంటి నొప్పులు, నీరసం, కళ్ల మంటలు లాంటివి వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంలో ప్రజలను చైతన్యం చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే గ్రామంలోని హెల్ప్లైన్ బాధ్యులను సంప్రదించేలా చూడనున్నారు వీరికి తొలి దశలో కరోనా టెస్టులు చేయించుకునేలా చేయడం, ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కిట్ను సక్రమంగా ఉపయోగించుకునేలా చెప్పడం లాంటి వాటిపై వివరిస్తారు. తొలి దశలోనే ప్రజలను అప్రమత్తం చేయగలిగితే తర్వాత కేసులు సీరియస్ కాకుండా అడ్డుకోగలమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో తొలి దశలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోతే వారు కోలుకున్నట్లేనని వైద్యులు సైతం చెబుతున్నారు. నాలుగైదు రోజుల తర్వాత ఇక రెండో దశలో తీవ్ర జ్వరం, ఆక్సిజన్ లేవల్స్లో హెచ్చుతగ్గులు, తీవ్ర దగ్గు, ఆయాసం లాంటిదా వస్తే ఏం చేయాలనే దానిపైనా అవగాహన కల్పించనున్నారు. ఇలాంటి వారి వివరాల ఆధారంగా వీరికి సరైన వైద్య సదుపాయం, మందుల వినియోగం వంటి వాటిపై అప్రమత్తం చేయనున్నారు.
దీంతో వీరి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా చూడనున్నారు. తదుపరి వైద్య సేవల కోసం దవాఖానలకు వెళ్లేందుకు గ్రామ పెద్దలు, యువతతో కలిపి సహకారం అందించాలని భావిస్తున్నారు. ఇక మూడో దశలో కరోనా పాజిటివ్ వచ్చిన వారితోపాటు వారి కుటుంబంలోని ఇతరులకు ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా.. ఉంటే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడూ గమనించనున్నారు. దీంతోపాటు పాజిటివ్ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్టు వ్యాక్తులను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం రెండో వేవ్ ఉండగా, మూడో వేవ్ కూడా రానున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో గ్రామాల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు కేంద్ర, రాష్ర్టాల బృందాల నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక ప్రణాళికపై జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనాపై అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తోపాటు వైద్య అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
తమ శాఖలోని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితోనూ చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎక్కువ మంది నిరుపేదలు, కష్టజీవులు ఉంటారని, అలాంటి వారిని చైతన్యం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ మంది నిర్లక్ష్యంతో ఉంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో వారికి తొలి దశలోనే సరైన అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి తీవ్రత కాకముందే కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవేళ నాలుగైదు రోజుల తర్వాత కూడా మరింత ఎక్కువ తీవ్రత ఉంటే ఆ దశలో తీసుకోవాల్సిన చికిత్స విషయంలోనూ చైతన్యం కల్పించడం తమ లక్ష్యమన్నారు. కరోనా బారిన పడకుండా ముందస్తుగా చేస్తున్న అప్రమత్తతోపాటు పడ్డాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమని ఎస్పీ రంగనాథ్ వివరించారు. ఇది ఓ ప్రజా ఉద్యమంగా కొనసాగేలా అందరూ కలిసివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని గతంలో అనేక ఉదంతాలు స్పష్టం చేశాయని ఎస్పీ చెప్పారు.