అడవిదేవులపల్లి, మే 17: మండల కేంద్రంలోని ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న కరోనా పేషెంట్స్కు ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ సోమవారం డ్రైఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి ఇండ్లల్లో వసతులు లేని వారు ఐసొలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మండలంలోని కొత్తనందికొండలో చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకున్న రమావత్ శివను శనివారం ఐసొలేషన్ కేంద్రానికి తరలించగా, సోమవారం అతడికి నిర్వహించిన కరోనా ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కొత్త మర్రెడ్డి, కుర్రా పకీరా, నాయకులు కూరాకుల గోపీనాథ్, పిల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శానిటైజర్లు, మాస్కులు అందజేత
త్రిపురారం : స్థానిక గ్రామపంచాయతీ కార్మికులకు సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి సోమవారం శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్లు పంపిణీ చేశారు. అదే విధంగా పింఛన్ల కోసం గ్రామపంచాయతీకి వచ్చిన వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకుడు జంగిలి శ్రీనివాస్యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.
భోజనం ప్యాకెట్ల పంపిణీ
నిడమనూరు : లాక్ డౌన్ కారణంగా లారీ డ్రైవర్లు, రైతులు, వృద్ధులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతుండగా ఆదుకునేందుకు కొందరు యువకులు ముందుకు వచ్చారు. సోమవారం తమ సొంత ఖర్చులతో డ్రైవర్లు, రైతులు, వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం కొనసాగిస్తా మన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పగిళ్ల శివ, నరేందర్, నాగయ్య, షేక్ ఇస్మాయిల్, గణపతి నాగరాజు, సురేశ్, మహేశ్, కోటి, రమేశ్, నాగరాజు, సాయిరాం, వేణు పాల్గొన్నారు.