కట్టంగూర్, మే 16 : కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో పక్కాగా అమలవుతున్నది. ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత దుకాణాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేశారు. లాక్డౌన్తో ఈదులూరు రోడ్డు, 65 నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు లేక పోవడంతో నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ బత్తుల శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు.
రహదారులు నిర్మానుష్యం
దేవరకొండ : లాక్డౌన్తో పది గంటల అనంతరం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం సడలింపు సమయంలో షాపులు, మార్కెట్లు సందడిగా కన్పిస్తున్నాయి. అనంతరం ప్రజలంతా ఇండ్లకు చేరుకోగా, దుకాణాలు మూత పడుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఎవరైనా షాపులు తెరిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. వ్యవసాయ పనులు కూడా కొనసాగుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మర్రిగూడ : మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. పరిసర గ్రామాల ప్రజలు ఉదయం వివిధ సామగ్రి కొనుగోలుకు మండల కేంద్రానికి వచ్చారు. ఆదివారం కావడంతో చికెన్, మటన్, వైన్స్ షాపుల వద్ద రద్దీ కనిపించింది. 10గంటలకు అన్ని దుకాణాలు మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు.
సడలింపు వేళ సందడి
హాలియా : లాక్డౌన్ సడలింపు సమయాల్లో ప్రజలు దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నారు. ఉదయం వేళల్లో దుకాణాల వద్ద గుంపులుగా చేరుతున్నారు. హాలియాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవగా ఉన్నప్పటికీ ప్రజలు భౌతిక దూరం పాటించక పోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సంతలో భౌతిక దూరం ఎక్కడ
నందికొండ : నందికొండ పైలాన్కాలనీలోని గాంధీ బజార్ వద్ద రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా కొనుగోళ్లు జరుపుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులుగా చేరుతున్నారు. దుకాణాలను గతంలో మాదిరిగా పోలీస్గ్రౌండ్లోనే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దుకాణాల వద్ద రద్దీ
దామరచర్ల : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండలంలో కొనసాగుతున్నది. ఉదయం వేళల్లో మాత్రమే ప్రజలు బయటికి వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం మండల కేంద్రంలో చికెన్, మటన్ షాపుల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. ప్రజలు మాస్కులు ధరించి నప్పటకీ భౌతిక దూరం పాటించడంలేదు. వాడపల్లి ఎస్ఐ విజయకుమార్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేశారు.
కానరాని భౌతిక దూరం
నిడమనూరు : మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతున్నది. కానీ సడలింపు సమయంలో మాత్రం ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఆదివారం మటన్, చికెన్, చేపల మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన వ్యాపారులతో పాటు, రోడ్లపైకి వచ్చిన 45 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.
పెరిగిన మాంసం, చేపల విక్రయాలు
మాల్: కొవిడ్ నేపథ్యంలో ఆదివారం మాంసం, చికెన్, చేపలు, గుడ్లు వంటి వాటికి డిమాండ్ ఏర్పడింది. పట్టణంలో ఉదయం నుంచే మాంసం, చేపల విక్రయించే దుకాణాల వద్ద జనాల రద్దీ కనిపించింది. 10 గంటల వరకు విక్రయాలు కొనసాగాయి.