నల్లగొండ, మే 13 : కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినందున వైద్యులు అంతా మానవీయంగా ఆలోచన చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ కోరారు.కలెక్టరేట్లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో ఎస్పీ రంగనాథ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ వల్ల అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమయంలో భారీగా చార్జీలు పెంచకుండా వైద్యులు సహకారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ప్రైవేటు దవాఖానల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య వృత్తితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు దవాఖాన నడుపుతున్నారని వారు కనీస ఆలోచన చేయకుండా అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిపారు.
అయితే ఈ సమయంలో మానవీయంగా ఆలోచన చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పారదర్శకత లోపించిందని అంతేకాకుండా అనేక ఆస్పత్రుల్లో కనీసం రిజిస్టర్లు కూడా నిర్వహించడం లేదన్నారు. డబ్బున్న వారు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్తున్నారని ఇక్కడ డబ్బులు లేని పేద వారు చూపించుకుంటున్నారని అలాంటి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రుల నిర్వాహకులు, డాక్టర్లు మానవత్వంతో ఆలోచన చేసి వైద్యం చేయాలని సూచించారు. గతం కంటే జిల్లాలో ఆస్పత్రుల సంఖ్య పెరిగిందని అయితే వైద్యులు కూడా మంచి కోణంలో ఆలోచన చేసి వైద్యం చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కొండల్ రావు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ సురేశ్, ఎస్ఐ నర్సింహ, ఐఎంఏ అధ్యక్షుడు పుల్లారావు, వైద్యులు రామారావు, హనుమంతు మాలి, చెరుకు సువాస్, రాఘవేందర్రెడ్డి, ప్రభాకర్ గౌడ్, జానకీరెడ్డి, వెంకన్న, చంద్రహాసన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.