నల్లగొండ ప్రతినిధి, జూలై12(నమస్తే తెలంగాణ):ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో మెరుగైన వైద్యసేవలు 24గంటలపాటు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో నిష్ణాతులైన వైద్యులు, సిబ్బంది సేవలు కూడా రోగులకు అందుతున్నాయి. కేసీఆర్ కిట్తో ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో ప్రసూతి వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు కొవిడ్ నేపథ్యంలో అదనపు సౌకర్యాలు సమకూర్చారు. ఆక్సిజన్, వెంటిలేషన్ సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. ఎంతో వ్యయంతో కూడుకున్న డయాలసిస్ సేవలు సైతం ప్రజలకు ఉచితంగానే
అందుబాటులోకి వచ్చాయి. ఇక బాగా ఖరీదైన సీటీ, ఎంఆర్ఐ స్కాన్లకు సంబంధించిన మిషన్లను సైతం రూ.2కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇవి కూడా త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందించనున్నాయి.
నెల రోజులుగా..
వైద్య పరీక్షలు పేదలకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నస్టిక్ పేరుతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా కేంద్రంలో సెంటర్ను నెలకొల్పారు. జూన్ 9న మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఎంపిక చేసిన పీహెచ్సీల నుంచి శాంపిల్స్ సేకరించి 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తున్నది.
57 రకాల పరీక్షలు
తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం ద్వారా 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగానే చేస్తున్నారు. టెస్టు స్వభావాన్ని బట్టి ఒక్కో దానికి రూ.500 నుంచి రూ.1600 ఉన్నాయి. వీటన్నింటికీ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం భరిస్తున్నది. వైద్య పరీక్షల అనంతరం వాటి రిపోర్టులను నేరుగా రోగుల సెల్ఫోన్లకు పంపిస్తున్నారు. ఈ మెయిల్ ఆప్షన్ ఇస్తే దానికి కూడా పంపిస్తున్నారు. వీటి ద్వారా తదుపరి వైద్యసేవలను అందిస్తున్నారు. డయాబెటిక్ ప్రొఫైల్ పేరుతో 6రకాల పరీక్షలు, థైరాయిడ్ ప్రొఫైల్లో 3, లివర్ ఫంక్షనింగ్లో 10, రెనాల్ ఫంక్షనింగ్లో 3, లిపిడ్ ప్రొఫైల్లో 8, సీరం ఎలక్ట్రోలైట్స్లో 3, పాథాలజీ విభాగం.. కంప్లీట్ బ్లెడ్ పిక్చర్లో 12, మైక్రోబయాలజీలో 7, ఇతర విభాగంలో 3 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 53 రకాల పరీక్షలను ఇందులో నిర్వహిస్తున్నారు. రానున్న కాలంలో ఈ పరీక్షలను జిల్లాలోని అన్ని పీహెచ్సీలకు వచ్చే రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీలను ఏరియాల వారీగా రూట్లను విభజించి సేకరించిన శాంపిల్స్ను నల్లగొండకు తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పరీక్షలపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు మెరుగైన వైద్య సేవల గురించి ఆలోచించలేదని గుర్తు చేస్తున్నారు.
రోజుకు 40 మందికిపైగా పరీక్షలు
టీ-డయాగ్నస్టిక్ సెంటర్లో రోజుకు 40 మందికి పైగా పరీక్షలు చేస్తున్నాం. జిల్లాను ఐదు రూట్లుగా విభజించినప్పటికీ వాహనాల టెండర్లు పూర్తి కాకపోవడంతో కేవలం ఒక్క రూట్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నాం. యూహెచ్సీ, సీహెచ్సీ, పీహెచ్సీలకు వెళ్తే అక్కడి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్స్ రక్త నమునాలు సేకరించి డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపిస్తారు. వాటి రిపోర్టులను రోగి మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేయడంతోపాటు సంబంధిత దవాఖానకు పంపుతారు.
5,518 పరీక్షలు..
నల్లగొండలోని టీ-డయాగ్నస్టిక్ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రం నోడల్ ఆఫీసర్గా సీనియర్ వైద్యులు డాక్టర్ అరుంధతి వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచే ఇందులో టెస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను నల్లగొండలో నిర్వహిస్తున్నారు. అక్కెనపల్లి, నార్కట్పల్లి, కట్టంగూర్, ఓగోడు, తిప్పర్తి, నల్లగొండలోని లైన్వాడ, మాన్యంచెల్క, పానగల్ పీహెచ్సీలకు వచ్చే రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన శాంపిల్స్ను ప్రత్యేక వాహనంలో నల్లగొండకు తరలిస్తున్నారు. శాంపిల్స్ను పరీక్షించాక రెండు, మూడు గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు 953 మంది రోగుల నుంచి 1855 శాంపిల్స్ సేకరించారు. 5,518 రకాల పరీక్షలు చేశారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.