నీలగిరి, మే12 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం ఇప్పటి వరకు మూడు దశల్లో వ్యాక్సిన్ వేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 43 కేంద్రాల్లో టీకాల వేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 144260 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇందులో 17105 మంది ఆరోగ్య సిబ్బంది, 11727 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, 68,140 మంది 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక రోగులు, 47288 మంది 60 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 1,61, 643 మంది టీకా వేసుకున్నారు. ఇందులో మొదటి విడుతలో 1,35,644 మంది, రెండో విడుతలో 25,999 మంది టీకా వేసుకున్నారు. ఇక కొవిన్, ఆరోగ్య సేతులాంటి యాప్లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. నల్లగొండ ఇప్పటి వరకు 2,38,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
మూడు దఫాల్లో 1,44,260 మందికి..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మూడు దఫాలుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వారియర్స్కు మాత్రమే టీకాలు వేశారు. రెండో దశలో ఫ్రంట్లైన్ వారియర్స్, ఆరోగ్య సిబ్బందితోపాటు 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక రోగులు, 60 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ వేశారు. మూడో దశలో మొదటి, రెండో దశలో వేసుకోని వారికి ఇచ్చారు. మొదటి దశ జనవరి16 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలకు వ్యాక్సిన్ వేశారు. నల్లగొండ జిల్లాలో ఆరోగ్య సిబ్బందికి మొదటిడోసులో 7,508, రెండో డోసులో 5,345 మందికి టీకా ఇచ్చారు. ఫ్రంట్లైన్ వారిలో మొదటి డోసు 2,402 మందికి, రెండో డోసు ఇంకా వేసుకోలేదు. 9,910 మందికి మొదటి డోసు, 5,345 మందికి రెండో డోసు మొత్తంగా మొదటి దశలో 15,255 మందికి వ్యాక్సిన్ వేశారు.
రెండో దశలో..
రెండోదశ మార్చి 1 నుంచి మార్చి 31 వరకు నిర్వహించారు. ఇందులో ఆరోగ్య సిబ్బందికి మొదటి డోసులో 1286, రెండో డోసులో 1523 మందికి టీకా ఇచ్చారు. ఫ్రంట్లైన్ వారిలో మొదటి డోసు 543 మంది, రెండో డోసు1920 మందికి, 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక రోగుల్లో మొదటిడోసు 2644 మందికి, రెండో డోసు 13 మందికి టీకా వేశారు. 60 సంవత్సరాలు పైబడిన 5481 మందికి మొదటి డోసు, 39 మందికి రెండో డోసు వేశారు. 9953 మందికి మొదటి డోసు, 3495 మందికి రెండో డోసుమొత్తంగా మొదటి దశలో 13448 మందికి వ్యాక్సిన్ వేశారు.
మూడో దశలో..
మూడో దశను ఏప్రిల్ ఒకటి నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో ఆరోగ్య సిబ్బందికి మొదటి డోసులో 486 మందికి, రెండో డోసులో 957మందికి వ్యాక్సిన్ వేశారు. ఫ్రంట్లైన్ వారికి మొదటి డోసు 5,911 మందికి, రెండో డోసు 952 మందికి, 45 సంవత్సరాలుదాటిన దీర్ఘకాలిక రోగుల్లో మొదటిడోసు 55,237 మందికి, రెండో డోసు 10246 మందికి టీకా ఇచ్చారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి 3,3073 మందికి మొదటి డోసు, 8695 మందికి రెండో డోసు వేశారు. 94,707 మందికి మొదటి డోసు, 20,850 మందికి రెండో డోసు కలిపి మొదటి దశలో1,15,557 మందికి టీకా ఇచ్చారు.
అందుబాటులో 6440 డోసులు..
జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 1,43,240 కొవిషీల్డ్, 9,620 కొవాగ్జిన్ డోసులు మంజూరు చేసింది. 1,40,560 డోసులు రాగా 1,37,636 మందికి ఇచ్చారు. 2924 డోసులు వృథా కాగా 2,680 డోసులు స్టోరేజీలో ఉన్నాయి. 7,610 కొవాగ్జిన్ డోసులు కేంద్రాలకు రాగా 6,624 మందికి ఇచ్చారు. 986 డోసులు వృథా అయ్యాయి. ఇంకా 2010 డోసులు స్టోరేజీలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 6440 డోసులు అందుబాటులో ఉన్నాయి.