వినాయక చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఇండ్లల్లో, వాడవాడలా ప్రత్యేకంగా అలంకరించిన మండలాల్లో గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. పెద్దసంఖ్యలో మట్టి గణపతులకే ప్రాధాన్యమివ్వగా పలుచోట్ల వినూత్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. గణపతి బొప్ప మోరియా.. గణేశ్ మహారాజ్కీ జై అంటూ లంబోదరుడిని కొలువగా తొమ్మిది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొననున్నది. గణేశ్ నవరాత్రోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా కొలువుదీరిన గణనాథుడి మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయి. పూలు, పత్రి, ఉండ్రాళ్ల పాయసం నైవేద్యంగా సమర్పించారు. వీధుల్లో మండపాలను తీర్చిదిద్దడంలో ఉత్సవ కమిటీలు పోటీ పడ్డాయి. ఇండ్లల్లో వినాయకుడిని పూజించే భక్తుల్లో 90శాతం మంది ఈ ఏడాది మట్టి ప్రతిమలకే మొగ్గు చూపడం విశేషం.
ఇస్మార్ట్ గణేశ్
ప్రతి మండపం జియో ట్యాగింగ్, విగ్రహాలకు క్యూఆర్ కోడ్
నీలగిరి, సెప్టెంబర్ 11 : వినాయక నవరాత్రులు ప్రశాంతంగా ముగిసేలా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. మండపాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానించగా.. ప్రతి మండపాన్నీ జియో ట్యాగింగ్ చేపట్టింది. పోలీసు సిబ్బంది ఆయా మండపాలను సందర్శించి విగ్రహాలకు క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. దాంతో ట్యాగింగ్ పూర్తయిన మండపం మ్యాప్పై ఒక్క క్లిక్ చేస్తే చాలు రూట్ మ్యాప్, నిర్వాహకుల పేర్లతోపాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నది. నిమజ్జనం పూర్తయిన అనంతరం విగ్రహాల వివరాలు యాప్ నుంచి తొలగిస్తారు.