కనగల్, జూన్ 11 : కరోనాను కట్టడి చేసేందుకు గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంచాయతీ సిబ్బంది, పాలకులు, అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాంకులు, మురుగు కాల్వలు, ప్రధాన రహదారుల వద్ద ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. శనివారం కనగల్ మండలంలోని కురంపల్లి గ్రామంలో సర్పంచ్ తలారి కరుణశ్రీరవీందర్, పారిశుధ్య కార్మికులు గడపగడపకూ వెళ్లి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
క్వారంటైన్ కేంద్రానికి ఐదుగురు తరలింపు
తిప్పర్తి, జూన్ 11 : కరోనా పేషెంట్లు హోం క్వారంటైన్లో ఉండకుండా బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఇండ్లూరు గ్రామంలో పాజిటివ్ వచ్చిన ఐదుగురు వ్యక్తులు బయట తిరుగుతుండటంతో సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ, పీహెచ్సీ డాక్టర్ అనూష వెళ్లి వారిని ఎంజీయూలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా పేషెంట్లు కచ్చితంగా 15రోజులు ఇంట్లోనే ఉండాలని, బయట తిరిగితే ఇతరులకు వైరస్ సోకుతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతంపేటలో వైద్య శిబిరం..
మర్రిగూడ, జూన్ 11 : మండలంలోని అంతంపేటలో శుక్రవారం కరోనా పరీక్షలు చేసేందుకు హెల్త్ క్యాంపును నిర్వహించినట్లు మండల వైద్యాధికారి రాజేశ్ తెలిపారు. 100మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించి మెడికల్ కిట్లను అందించామన్నారు. మండలంలో మొత్తం 202 టెస్టులు చేయగా 11 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ నరేశ్, ఏఎన్ఎం అరుణామేరీ, ఆశ కార్యకర్తలు మమత, సునీత, ముత్యాలి, అనిత పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
నల్లగొండ మండల పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ మూడు రోజుల్లో మండలంలో 23 దుకాణాదారులు, నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఏడుగురు, అనుమతులు లేకుండా వివాహం జరుపుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 27 ఈ-పిటీ కేసులు, 23వాహనాలు సీజ్, 167 వాహనాలకు చలానా వేసినట్లు పేర్కొన్నారు.