నల్లగొండ, మే 10 : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో రైతు పండించిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి సుమారు 15 వేల మందికి పైగా నిత్యం పని చేస్తున్నారు. రెండు జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి 714 కేంద్రాలు ప్రారంభించారు. నల్లగొండలో 375, సూర్యాపేటలో 339 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 408 ఐకేపీ కాగా.. 2,933 పీఏసీఎస్ మిగిలినవి మార్కెటింగ్, డీసీఎంఎస్ కేంద్రాలు. ప్రతి కేంద్రంలో ఆరు నుంచి ఎనిమిది మంది హమాలీలు, నాలుగు నుంచి ఆరుగురు మహిళా సంఘాల సభ్యులు, ఒక వీబీకే పని చేస్తుండగా నల్లగొండలో 140 మంది ఏఈఓలు, సూర్యాపేటలో 112 మంది పని చేస్తున్నారు. రెండు జిల్లాలో ప్రతి మిల్లు వద్ద ఒక వీఆర్వో చొప్పున 245 మంది పని చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ధాన్యం నాణ్యతను, ఐకేపీ (డీఆర్డీఏ అనుబంధం), పీఏసీఎస్(డీసీఓ అనుబంధం) డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖలు కొనుగోలు బాధ్యతను చేపడు తున్నా యి. డీఎస్ఓ, సివిల్ సప్లయ్, రవాణా శాఖలు డబ్బుల చెల్లింపు బాధ్యత చేస్తుండగా పోలీస్, రెవెన్యూ శాఖలు రైతుకు అన్యాయంజరుగకుండా పర్యవేక్షణ చేస్తుంది.
కరోనా పరిస్థితుల్లోనూ..
కరోనా రెండో దశ ఉధృతంగా విస్తరిస్తున్నది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సారి ఈ మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొన్ని గ్రామాల్లో వైరస్ కారణంగా ఉపాధి హామీ పనులను నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఈ యాసంగిలో రైతు పండించిన ధాన్యం విక్రయించకుండా నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్కార్ సూచన మేరకు పలు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నాయి. తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసినప్పటికీ సర్కార్ ఆదేశాలతో దేశానికి అన్నం పెట్టే అన్నదాత సేవలో నిమగ్నమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తూ డబ్బులు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నాయి.
లక్ష్యంలో సగానికి పైగా ..
రెండు జిల్లాలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు లక్ష్యంలో సగానికి పైగా కొనుగోలు చేశారు. 13 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా 7.53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.13.30 కోట్ల ఉండగా అందులో ఇప్పటి వరకు రూ.520 కోట్లు రైతాంగానికి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నేడు, రేపో మరో మూడు వందల కోట్లు జమ కానున్నట్లు సివిల్ సప్లయ్ యంత్రాంగం చెప్పుతుంది. అయితే ఆరంభంలో కొంచెం తాలు, పొట్టిఒడ్ల సమస్య ఉండగా ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కావడంతో కొనుగోళ్లలో వేగం పెరిగిందని డీఆర్డీఏ, డీసీఓ, డీసీఎంఎస్, మార్కెటింగ్ యం త్రాంగం అంటుండగా డబ్బు చెల్లింపులో సర్వర్ సమస్య తొలగినందును ఆర్థిక లావాదేవీల్లోనూ వేగం పెరిగిందని సివిల్ సప్లయ్ యంత్రాంగం తెలిపింది