మిర్యాలగూడ టౌన్, మే 10 : ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’.. కరోనా కాలంలో డాక్టర్లతోపాటు యోగక్షేమాలు ప్రతిఒక్కరూ ఇదే చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ, కొనడానికి వెళ్తే పండ్ల ధరలు మాత్రం రుచించడం లేదు. ఎండా కాలంలో పండ్ల ధరలు కాస్తంత ఎక్కువ ఉండడం సహజమే. కానీ, ఇప్పుడు కొవిడ్ పరిస్థితుల్లో మరీ భగ్గుమంటున్నాయి. నాలుగైదు వందలు పెడితే కానీ మూడు రకాల పండ్లు రావడం లేదు. ముఖ్యంగా సీ విటమిన్ లభించే బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, యాపిల్ ధరలు చుక్కల్లో ఉన్నాయి. ఇమ్యూనిటీ కోసం పండ్లు తీసుకునే కుటుంబాలు వారానికి కనీసం రూ.500 నుంచి వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
కరోనా పరిస్థితుల్లో పండ్ల ధరలు మరింత పెరిగాయి. రోగ నిరోధకశక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సీ-విటమిన్ లభించే బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, యాపిల్ తదితర పండ్ల ధరలు చుక్కల్లో ఉన్నాయి. యాపిల్ కిలో రూ.220 ఉంది. రూ.100 పెడితే కానీ అర డజన్ నారింజ పండ్లు రావడం లేదు. రెండు నెలల క్రితం రూ.10కి ఒక నారింజ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రేట్కు అడుగుతుంటే వింతగా చూస్తున్నారు. రూ.50 పెడితే గానీ ఒక్క దానిమ్మ రావడం లేదు. ఒక్కో కివీ ఫ్రూట్ ధర రూ.30-40 మధ్య పలుకుతున్నది. బొప్పాయి కేజీ రూ.60-80 ఉంటున్నది. ఇక జామకాయలు కిలో రూ.60-70 వరకు చెప్తున్నారు. ద్రాక్ష కేజీ రూ.100-120 దాటిపోతున్నది. ఇక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న అల్లనేరేడు పండ్లు కేజీ రూ.150-200 పలుకుతుండడం గమనార్హం. పుచ్చకాయ ధరలు మాత్రం కాస్త అందుబాటులో ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇది కేజీ రూ.20-30 పలుకుతున్నది.
వివిధ రాష్ర్టాల నుంచి దిగుమతి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు స్థానికంగా దొరకని పండ్లను వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ద్రాక్ష, దానిమ్మ పండ్లను సోలాపూర్.. యాపిల్ న్యూజిలాండ్.. అరటి తాడిపత్రి, అనంతపురం.. కొబ్బరి బోండాలను పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి. మామిడి పండ్లు మన జిల్లాలోనే లభ్యమవుతుండడంతో తక్కువ ధరకే దొరుకుతున్నాయి.
దిగుమతి లేకనే..
ఎండలు ఎక్కువైనయి.. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. దీనివల్ల పండ్ల గిరాకీ బాగా పెరిగింది. ఇంతకుముందు కేజీ ఆపిల్ రూ.120 నుంచి రూ.130 ఉంటే ఇప్పుడు రూ.220 నుంచి రూ.250 వరకు దొరుకుతున్నయి. అన్ని రకాల పండ్లు ఇట్లనే ఉన్నయి. డిమాండ్కు తగిన దిగుమతి లేకపోవడమే ఇందుకు కారణం.
-అజీజ్, పండ్ల వ్యాపారి, మిర్యాలగూడ
ఎంత ధరైనా కొనక తప్పదు
కరోనాను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. అందువల్ల పండ్లు తినాల్సి వస్తున్నది. ధరలు పెరిగాయని తినకుండా ఉంటే అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంత ధరైనా కొనక తప్పడం లేదు.
-యడవల్లి పద్మ, మిర్యాలగూడ