కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
కరోనా వైరస్ లక్షణాలున్న వారికి హెల్త్కిట్ల అందజేత
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 4,91,998 ఇండ్లలో పూర్తయిన సర్వే
కొవిడ్ ఉధృతిని ఎక్కడికక్కడే నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా సాగుతున్నది. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు వాడవాడలా తిరిగి ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి ఇంటి వద్దే హెల్త్కిట్లు అందిస్తున్నారు. గురువారం సర్వే ప్రారంభంకాగా నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లాలో 2,80,750, సూర్యాపేట జిల్లాలో 2,11,248 ఇండ్లను సర్వే చేశారు. నేడు లేదా రేపు సర్వే పూర్తి కానున్నది.
నీలగిరి, మే 9 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ యుద్ధం చేస్తున్నది. ఓ వైపు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. మరోవైపు ప్రైవేట్ అసుపత్రుల్లోనూ కొవిడ్ చికిత్సకు అనుమతులు ఇస్తున్నది. ఇంకోవైపు వ్యాక్సిన్లు ఇస్తూనే, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నది. వీటితోపాటు సబ్సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి అంతరాయం లేకుండా చూస్తున్నది. ఇదే సమయంలో గురువారం నుంచి చేపట్టిన జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నది. ఇంటింటా సర్వేలో ప్రత్యేక బృందాలు జ్వరం లేదా కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే వారికి మెడికల్ కిట్ ఇవ్వడంతో పాటు ఏ మందులు ఏలా వేసుకోవాలో చెబుతున్నారు. హోం ఐసొలేషన్ విధానంలో అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. వీటితోపాటు సదరు బాధితులు అడిగే ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెబుతున్నారు. కరోనా విషయంలో భయమే మనిషిని చంపేస్తున్నదని అనేక రకాల సర్వేలు వెల్లడిస్తుండగా, బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ ఆత్మైైస్థ్ధెర్యం సదరు బాధితుడికే కాదు వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేస్తున్నది.
ఐదుగురు సభ్యులతో బృందం
గతంలో నిర్వహించిన ధరణి, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వారీగా ప్రతి వెయ్యి ఇండ్లకు ఐదుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో 182 బృందాలు, 847 గ్రామ పంచాయతీల్లో 1,303 బృందాలతో మొత్తంగా 1,485 ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 801 బృందాలతో సర్వే చేయిస్తున్నారు. ఈ బృందంలో ఆశవర్కర్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ/మున్సిపల్ సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ లాంటి పెద్ద పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సిబ్బందిని అదనంగా కేటాయించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురితో బృందాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 3,46,508 ఇండ్లకు 2,80,750 ఇండ్లలో సర్వేను పూర్తి చేశారు. కేవలం 66 వేల ఇండ్లు మాత్రమే సర్వే చేయాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఇండ్లకు 2,11,248 ఇండ్లలో సర్వేను పూర్తి చేశారు. ఇంకా సుమారు 90 వేల ఇండ్లను సర్వే చేయాల్సి ఉంది.
నాలుగు రోజుల్లో 82 శాతం సర్వే
జిల్లా వ్యాప్తంగా ఇంటింటా జ్వరం సర్వే ప్రత్యేక బృందాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 82 శాతం సర్వేను పూర్తి చేశాం. మిగిలిన 18 శాతం సోమవారం చేస్తాం. ఆరోగ్య పరీక్షలు చేసేందుకు యుద్ధప్రతిపాదికన చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించారు. కరోనా అనుమానితులను గుర్తించి అవసరమైన మందులు ఇంటి వద్దనే ఇస్తున్నాం. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా మందులు అందించాం. కరోనా బాధితులు వైద్యసాయం విషయంలో ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుంది.